Begin typing your search above and press return to search.

మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన

భారత్‌లో జరుగుతున్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన పెజెష్కియాన్ 'ఇండియా టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ అంశంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   13 Sept 2026 5:54 PM IST
మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన
X

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం, ఆయన మనుగడపై అంతర్జాతీయంగా సాగుతున్న అనేక ఊహాగానాలు, వార్తలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెరదించారు. అమెరికా దాడుల్లో మొజ్తబా ఖమేనీ మరణించారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఆయన సజీవంగానే ఉంటూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో జరుగుతున్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన పెజెష్కియాన్ 'ఇండియా టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ అంశంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయని.. ఆ అసమర్థత వల్లే ఆయన మరణించారంటూ ప్రచారం చేస్తోందని పెజెష్కియాన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించడం.. ఇరాన్ నాయకత్వంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగానే ప్రత్యర్థులు ఇటువంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఆయన ఆచూకీ.. ప్రస్తుత స్థానానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేమని, నాయకత్వ భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని వెల్లడించారు.

ఇరాన్ అత్యున్నత నాయకత్వ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా ఆ దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ప్రత్యర్థి దేశాలు ప్రయత్నిస్తున్నాయని పెజెష్కియాన్ అన్నారు. తమ దేశంలోని కీలక నాయకులను సైనిక దాడుల ద్వారా భౌతికంగా దెబ్బతీయడమే కాకుండా.. మీడియా వేదికగా నిరంతరం ఇన్ఫర్మేషన్ వార్ నడుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ తమ నాయకత్వం బలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మొజ్తబా ఖమేనీ మరణించారనే ప్రచారాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా నేరుగా ఖండించడం ద్వారా అంతర్జాతీయంగా సాగుతున్న అనేక సందేహాలకు స్వస్తి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆయన ప్రస్తుత స్థానం లేదా ప్రత్యక్ష ఆధారాలను ఇరాన్ గోప్యంగా ఉంచడంతో ఈ అంశంపై అంతర్జాతీయ దౌత్య వేదికలపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అధ్యక్షుడు పెజెష్కియాన్ చేసిన ఈ ప్రకటన అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న సమాచార, దౌత్యపరమైన ఉద్రిక్తతలకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.