Begin typing your search above and press return to search.

కిరోసిన్‌ బొగ్గు పొయ్యిలే శరణ్యమా ?

మొత్తానికి చూస్తే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ అంతుబట్టడంలేదు. మొత్తంగా చూస్తే యుద్ధం వల్ల పశ్చిమాసియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడనుంది అంటున్నారు.

By:  Satya P   |   19 March 2026 9:00 PM IST
కిరోసిన్‌ బొగ్గు పొయ్యిలే శరణ్యమా ?
X

పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో చల్లారేలా పరిస్థితి అయితే కనిపించడం లేదు. యుద్ధం మొదలైన కారణాలు అసహజమైనవి. ఇగోలే యుద్ధానికి దారి తీశాయి కాబట్టి ఈ యుద్ధం కొనసాగే తీరుతుంది అని అంతా అంటున్నారు. ఒక వైపు ఇరాన్ కసి మీద ఉంది. రెచ్చగొట్టింది అమెరికా ఇజ్రాయెల్ కాబట్టి తామెందుకు తగ్గాలి అన్నదే ఇరాన్ పంతం గా ఉంది. అమెరికా అయితే తాను తగ్గేది లేదంటూ చర్చలకు ఇరాన్ రావాలని అంటోంది. ఇజ్రాయెల్ అయితే ఇది తమ ఆత్మ రక్షణ అస్తిత్వ పోరాటం అని గట్టిగా వాదిస్తోంది. మొత్తానికి చూస్తే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ అంతుబట్టడంలేదు. మొత్తంగా చూస్తే యుద్ధం వల్ల పశ్చిమాసియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడనుంది అంటున్నారు.

ఎల్పీజీ కొరత ఆందోళనకరం :

ప్రస్తుతం ముడి చమురుని మోసుకుని వస్తున్న నౌకల నుంచి సరకు కేవలం ఒకటి రెండు రోజులకే సరిపోతోంది. ఇంకా 22 నౌకలు హర్మూజ్ జల సంధి అవతల ఇరుక్కుని ఉండిపోయాయి. ఇంకో వైపు ప్రపంచానికి ముడి చమురును అందించే కువైట్ లోని అతి పెద్ద చమురు కేంద్రాల మీద ఇరాన్ దాడులతో పరిస్థితి మొత్తం తల్లకిందులు అయ్యేలా కనిపిస్తోంది అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాజాగా చూస్తే కనుక ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడిస్తోంది. అయినా సరే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అంటోంది.

కిరోసిన్‌ బొగ్గు పొయ్యిలను వాడాలి :

ఇక పరిస్థితులు చూస్తే కొంత ఇబ్బందిగా ఉన్నాయని కేంద్ర వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ దేశంలో ఎల్పీజీ బ్లాక్‌ మార్కెటింగ్‌ అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ఇక తాజాగా దేశవ్యాప్తంగా ఆరు వేల ప్రాంతాలలో దాడులు చేశామని కేంద్రం అంటోంది. అయితే ప్రజలకు కూడా కేంద్రం కొన్ని కీలక సూచనలు చేస్తోంది. ఎల్పీజీ కి బదులుగా పీఎంజీ కనెక్షన్లను తీసుకోవాలని పేర్కొంటోంది. అదే సమయంలో రాష్ట్రాలకు తగినంత బొగ్గు నిల్వలు ఇవ్వాలని సింగరేణి కాలరీస్‌ను ఆదేశించామని కేంద్రం చెబుతోంది.

వారికి రాయితీలు :

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సమస్య ఇంకా ఉందని కేంద్రం చెబుతోంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సమస్య తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటోంది. కమర్షియల్‌ ఎల్పీజీకి బదులుగా సీఎన్‌జీ వినియోగించే వారికి రాయితీలు ఇస్తమాని కూడా కేంద్రం చెప్పడం విశేషం. గత మూడు రోజులలోనే ఏకంగా అయిదు వేల 600 మందికి పైగా వినియోగదారులు విజయవంతంగా పీఎన్‌జీకి మారారని కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్రాలకు మరో పదిశాతం అదనంగా కమర్షియల్‌ గ్యాస్‌ పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగానికి పీఎన్‌జీ, రవాణా ప్రయోజనాల కోసం సీఎన్‌జీ సరఫరా 100 శాతం ఉండేలా చూశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది గడచిన రెండు వారాల్లో లక్షా 25 వేల కొత్త గృహ కనెక్షన్లు, అలాగే కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం చెప్పుకొచ్చింది.