అమెరికా దెబ్బ.. భారత్ కు కొత్త చమురు గని.. 17 వేల కి.మీ. దూరం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి ప్రధాన ఆర్ధిక వనరు చమురు అనేది ట్రంప్ ఉద్దేశం. అందుకే ఆ దేశం నుంచి ఎవరూ చమురు కొనకుండా ఆంక్షలు పెడుతున్నారు.
By: Tupaki Political Desk | 1 Dec 2025 4:05 PM ISTరష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలు గత నెల ఆఖరు నుంచి అమల్లోకి వచ్చాయి. వీటికి భారత్ తో పాటు చైనా కూడా తలొగ్గడంతో రష్యా దిగ్గజ ఆయిల్ కంపెనీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ట్రంప్ అనుకున్నది సాధించారు..! మరి అత్యధికంగా చమురు దిగుమతిపైనే ఆధారపడే భారత్ పరిస్థితి ఏమిటి..? అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయానికి పరోక్షంగా భారత్ మూల్యం చెల్లించాలా? మన దేశానికి ప్రధాన చమురు ఎగుమతిదారు అయిన రష్యా నుంచి కొనుగోలు బంద్ అయితే మరి ఇకపై కొత్తగా ఎక్కడనుంచి కొనాలి..? రష్యా చమురు రానందున భారీగా ధరలు పెరుగుతాయా? ఇలా అనేక సందేహాలు...! దీంతో భారత్ కొత్త చమురు పార్ట్ నర్ ను ఎంచుకుంది. అది కూడా సుదూర తీరాన ఉన్న దేశం నుంచి కావడం గమనార్హం.
క్రికెట్ లోనే కాదు.. ఆయిల్ కూడా...
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి ప్రధాన ఆర్ధిక వనరు చమురు అనేది ట్రంప్ ఉద్దేశం. అందుకే ఆ దేశం నుంచి ఎవరూ చమురు కొనకుండా ఆంక్షలు పెడుతున్నారు. దీంతో భారత్ ఇప్పుడు కరీబియన్ దేశమైన గయానా నుంచి చమురు కొంటోంది. ఈ దేశం అమెరికాకు దగ్గరగా ఉంటుంది. కరీబియన్ సముద్రంలోని గయానా తదితర ద్వీప దేశాలు వెస్టిండీస్ జట్టుగా ఏర్పడి క్రికెట్ ఆడుతున్నాయి. అలా భారతీయులకు క్రికెట్ ద్వారా గయానా బాగా పరిచయం. ఇప్పుడు అదే దేశం నుంచి చమురు కొంటున్నాం. గయానా.. భారత్ కు కొత్త చమురు గని అయిందన్నమాట.
17 వేల కి.మీ.. నెల రోజుల ప్రయాణం...
వెస్టిండీస్ దీవుల్లోకి గయానా... భారత్ కు 17,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా... అమెరికా ఆంక్షల రీత్యా ప్రత్యామ్నాయంగా ఈ దేశంపై ఆధారపడక తప్పడం లేదు. గయానా నుంచి ఇప్పటికే రెండు సూపర్ ట్యాంకర్లు చమురుతో బయల్దేరాయి. ఒక్కోటి 2 మిలియన్ బ్యారెళ్ల చమురుతో ఉన్నాయి. ఇవి భారత్ కు చేరేందుకు నెల రోజులపైగా సమయం పట్టనుందని తెలుస్తోంది. అంటే, జనవరిలో కానీ మన దేశానికి చేరవన్నమాట. కాగా, ట్రంప్ ఆంక్షలతో భారత్.. రష్యా నుంచి కొనుగోళ్లు నిలిపివేసిన సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వస్తుండడం గమనార్హం.
కొత్త చమురు కేంద్రం గయానా
ఇటీవలి కాలంలో గయానా చమురు ఉత్పత్తిలో ముందుకెళ్తోంది. గణనీయమైన నిల్వలతో ఈ దేశం ప్రపంచంలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుతోంది. చమురు.. గయానా తలసరి ఆదాయ స్థితిని మారుస్తోంది. అయితే, కొత్తగా కనుగొన్న చమురు సంపద నిర్వహణలో గయానా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
