రంగనాథ్ సేఫ్ .. ఆ ఐఏఎస్ లకు వారెంట్ !
ఈ నేపథ్యంలో జస్టిస్ శామ్ కోషి, నరసింగరావు నందికొండలతో కూడా బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేసి, ఈ కేసులకు సంబంధించిన భూములపై స్టేటస్ కోకు ఆదేశించింది.
By: Tupaki Political Desk | 2 Sept 2026 9:35 AM ISTఉద్దేశ పూర్వకంగా కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు ఇచ్చిన క్షమాపణను తిరస్కరించి హైడ్రా కమీషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను వెంటనే పదవి నుండి తొలగించాలని జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి సారధ్యంలోని సింగిల్ బెంచ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజుకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
అయితే తమ ప్రభుత్వంలో హైడ్రా సమర్దవంతంగా పనిచేస్తుందని, ఎవరిని పదవుల్లో నియమించాలి అని కోర్టులు నిర్దేశిస్తే ఎలా ? అని సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తీర్పుపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే తన మీద సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై హైడ్రా కమీషనర్ రంగనాధ్ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేశాడు. తన మీద చర్యలను నిలిపివేయాలని పిటీషన్లో పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో జస్టిస్ శామ్ కోషి, నరసింగరావు నందికొండలతో కూడా బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేసి, ఈ కేసులకు సంబంధించిన భూములపై స్టేటస్ కోకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 3కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 63 సార్లు రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాడని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఆయనను పదవి నుండి తొలగించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. తాజాగా డివిజన్ బెంచ్ ఉత్తర్వుల నేపథ్యంలో రంగనాథ్ సేఫ్ అని చెప్పాలి.
అయితే ఇదే సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ లకు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. భూసేకరణ పరిహారం చెల్లింపుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆగస్టు 31న హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరికీ గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయినా వారు మంగళవారం హాజరు కాకపోవడంతో సెప్టెంబరు 7న వారిద్దరినీ హాజరు పరచాలని జస్టిస్ శ్రవణ్ కుమార్ రిజిస్ట్రీని ఆదేశించారు. బడ్జెట్ పరిమితంగా ఉండడం, జారీచేసిన టోకెన్లు ఎక్కువగా ఉండడంతో ప్రాధాన్యతా క్రమంలో జరుగుతున్న చెల్లింపుల నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశం సందీప్ కుమార్ సుల్తానియాకు లేదని, ఆయన ఆగస్టు 23 నుండి సెప్టెంబరు 1 వరకు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కోర్టుకు రాలేకపోయారని ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ కౌంటర్ దాఖలు చేశారు.
మరో అధికారి వికాస్ రాజ్ హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఎలాంటి పిటీషన్ దాఖలు చేయలేదు. ఇద్దరు అధికారులు ఆన్ లైన్లో గానీ, వ్యక్తిగతంగా గానీ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులకు బెయిలబుల్ వారెంటు జారీ చేయడం మినహా కోర్టు ముందు మరో దారి లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఐపీఎస్ అధికారి రంగనాథ్ సేఫ్ జోన్లోకి వెళ్లగా, ఈ ఇద్దరు అధికారులు బెయిలబుల్ వారెంట్లు అందుకున్నారు.
