బంగారం ధర 8 వేల డాలర్లకు చేరుతుందన్న నిపుణుల అంచనా!
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలను గమనిస్తే.. బంగారంపై అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంక్ డాయిష్ చేసిన అంచనా ఇన్వెస్టర్లలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Political Desk | 30 April 2026 11:16 AM ISTప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలను గమనిస్తే.. బంగారంపై అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంక్ డాయిష్ చేసిన అంచనా ఇన్వెస్టర్లలో పెద్ద చర్చకు దారితీస్తోంది. వచ్చే ఐదేళ్లలో బంగారం ధర 8 వేల డాలర్లకు (ప్రతి ఔన్స్కు) చేరుతుందని వారు భావించడం వెనుక ఆర్థిక సమీకరణాలు, 'డీ-డాలరైజేషన్' ప్రభావంపై ఉందని డాయిష్ స్పష్టంచేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే ఐదేళ్లలో గోల్డ్ రేట్ ఊహించని రీతిలో పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న నిల్వలను అమెరికా డాలర్ల నుంచి బంగారానికి మళ్లించడమే ప్రధాన కారణం కానుంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న డాలర్ ఆధిపత్యం ఇప్పుడు తగ్గుతుండడం బంగారం ధరలకు రెక్కలు తొడుగుతోంది.
కోల్పోతున్న డాలర్ పట్టు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ వాటా పడిపోతుండడం ఒక చారిత్రక పరిణామం. 2000వ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ దేశాల విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా 60 శాతంగా ఉండేది. కానీ, ప్రస్తుతం అది 40 శాతానికి పడిపోయింది. అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అమెరికా ఆర్థిక లోటు పెరుగుతుండడంతో, సెంట్రల్ బ్యాంకులు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా బంగారం వైపు చూస్తున్నాయి.
ఇంధన సంక్షోభం
ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచం ఇంధన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. చమురు సరఫరాలో ఆటంకాలు కలగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, కరెన్సీల విలువ పడిపోతోంది. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి, యుద్ధ సమయాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అత్యంత సురక్షితమైనదిగా భావించే బంగారం వైపు మళ్లిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరపై పెద్దగా చర్చ జరగనప్పటికీ, నిశ్శబ్దంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
బంగారంపై ఆసక్తి పెంచుకుంటున్న దేశాలు..
బంగారం నిల్వలను పెంచుకుంటున్న దేశాల జాబితా ఇప్పుడు మారుతోంది. చైనా, రష్యా దేశాలు అగ్రస్థానంలో ఉండగా, భారత్ మరియు టర్కీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు యూఏఈ (UAE) వంటి దేశాలు ఇప్పుడు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ దేశాలు డాలర్లలో కాకుండా బంగారం రూపంలో భద్రపరుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
డాయిష్ బ్యాంక్ అంచనా నిజమైతే, బంగారం ధర ప్రస్తుత ధరల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం (80 శాతానికిపైగా) ఉంది. ఇది సామాన్య ప్రజలపై భారం చూపినప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రం ఒక అద్భుతమైన వార్త. డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతున్న కొద్దీ, పసుపు లోహానికి ప్రాధాన్యత అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతూనే ఉంటుంది. వచ్చే ఐదేళ్లు బులియన్ మార్కెట్కు అత్యంత కీలకమైన కాలంగా మిగిలిపోనుంది.
