Begin typing your search above and press return to search.

జిబ్రాల్టర్‌లో 124 ఓడల శకలాలు చూసి షాక్ తిన్న శాస్త్రవేత్తలు!

జిబ్రాల్టర్ జలసంధి కేవలం వ్యాపార మార్గమే కాదు, అది ఒక నావికా సవాలు కూడా. ఈ జలసంధి ఒక చోట సన్నగా కేవలం 8 మైళ్ల (సుమారు 13 కిమీ) వెడల్పు మాత్రమే ఉంటుంది.

By:  Tupaki Political Desk   |   23 April 2026 6:00 PM IST
జిబ్రాల్టర్‌లో 124 ఓడల శకలాలు చూసి షాక్ తిన్న శాస్త్రవేత్తలు!
X

ఒకవైపు హర్మూజ్ జలసంధి చమురు సెగలతో ప్రపంచాన్ని వణికిస్తుంటే, మరోవైపు జిబ్రాల్టర్ జలసంధి తన గర్భంలో దాచుకున్న వేల ఏళ్ల చరిత్రను బయటపెట్టింది. కేవలం 29 చదరపు మైళ్ల పరిధిలోనే 124 నౌకల శకలాలు లభించడం అంటే, ఈ జలమార్గం మానవ నాగరికతకు ఎంతటి సాక్షిగా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ పటంలో ‘జిబ్రాల్టర్ జలసంధి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఐరోపా, ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తూ, అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రాన్ని కలిపే సన్నని జలమార్గం వేల ఏళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యానికి ధమనిలా పనిచేస్తోంది. స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్తలు 2020 నుంచి 2023 వరకు జరిపిన తాజా అధ్యయనంలో, ఈ జలసంధి అడుగున ఒక భారీ 'నౌకా శ్మశానం' ఉన్నట్లు తేలింది. ఇక్కడ లభించిన శకలాలు ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు సముద్ర ప్రయాణాలు ఎలా సాగేవో కళ్లకు కడుతున్నాయి.

చరిత్ర పుటల నుంచి.. ఆధునిక కాలం వరకు!

ఈ 124 నౌకల శకలాలు ఒక్క కాలానికో చెందినవి కావు. ఇవి మానవ చరిత్రలోని వివిధ దశలను ప్రతిబింబిస్తున్నాయి. క్రీస్తు పూర్వం నాటి ప్యూనిక్ నాగరికత, రోమన్ సామ్రాజ్యానికి చెందిన నౌకలు ఇక్కడ లభించాయి. 5వ శతాబ్దం నాటి ఒక నౌకలో స్పెయిన్ ప్రత్యేకత అయిన ‘ఫిష్ సాస్’ రవాణా చేసినట్లు ఆధారాలు లభించడం విశేషం. అంటే ఆ కాలంలోనే అంతర్జాతీయ ఆహార వ్యాపారం ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆధునిక చరిత్రకు సంబంధించి, ఇటలీకి చెందిన ఒక సబ్‌మెరైన్ శకలాన్ని కూడా ఇక్కడ గుర్తించారు. యుద్ధ సమయంలో ఈ వ్యూహాత్మక జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి దేశాల మధ్య ఎంతటి పోరాటం జరిగిందో నిరూపిస్తోంది.

జిబ్రాల్టర్ జలసంధి భౌగోళిక వింత

జిబ్రాల్టర్ జలసంధి కేవలం వ్యాపార మార్గమే కాదు, అది ఒక నావికా సవాలు కూడా. ఈ జలసంధి ఒక చోట సన్నగా కేవలం 8 మైళ్ల (సుమారు 13 కిమీ) వెడల్పు మాత్రమే ఉంటుంది. దీనివల్ల నౌకలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం లేదా తీరంలోని కొండలకు తగిలి మునిగిపోయే అవకాశం ఎక్కువ. శాస్త్రవేత్తలు కేవలం 10 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్లారు. కానీ ఈ జలసంధి లోతు 400 మీటర్లు. అంటే ఇంకా లోతుకు వెళ్తే మరో వందల నౌకల శకలాలు, పురాతన సంపద దొరికే అవకాశం ఉంది.

హర్మూజ్ వర్సెస్ జిబ్రాల్టర్.. రెండు కీలక మార్గాలు

ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్స్ వల్ల ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయే పరిస్థితి ఉంది. కానీ జిబ్రాల్టర్ పరిస్థితి వేరు. రోజుకు సగటున 300 నౌకలు ప్రయాణించే ఈ మార్గం గుండా యూరప్, ఆసియా, అమెరికా దేశాల మధ్య సరుకు రవాణా సాగుతుంది. ఈ మార్గం మూతపడితే మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నీ దిగ్బంధనానికి గురవుతాయి. అందుకే దీనిపై పట్టు కోసం బ్రిటన్, స్పెయిన్, మొరాకో మధ్య దౌత్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

శాస్త్రవేత్తల లక్ష్యం..

ఈ 124 నౌకల గుర్తింపు అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ ద్వారా 400 మీటర్ల లోతులో అన్వేషణ సాగించాలని పురావస్తు బృందం భావిస్తోంది. ఇక్కడ లభించే వస్తువులు ఆఫ్రికా, ఐరోపా దేశాల మధ్య ప్రాచీన కాలంలో జరిగిన సాంస్కృతిక మార్పిడిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి.