హైదరాబాద్ క్రీడా రంగానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
భారత ప్రభుత్వం ప్రకటించిన 2025 జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.
By: A.N.Kumar | 19 Aug 2026 11:22 AM ISTహైదరాబాద్ క్రీడా రంగానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వం ప్రకటించిన 2025 జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. బ్యాడ్మింటన్ నక్షత్రం పుల్లెల గాయత్రి గోపిచంద్, డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఈ గొప్ప గౌరవాన్ని సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘకాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ దేశానికి అనేక పతకాలు తెచ్చిపెట్టిన వీరి సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
గాయత్రి గోపిచంద్ భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, మాజీ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ పుల్లెల గోపిచంద్ కుమార్తెగా క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంత కష్టంతో, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్నతనం నుంచే కఠినమైన శిక్షణ పొందిన గాయత్రి.. ప్రస్తుతం భారత మహిళల డబుల్స్ విభాగంలో అత్యంత కీలకమైన క్రీడాకారిణిగా ఎదిగారు. తన భాగస్వామి ట్రీజా జాలీతో కలిసి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో అనేక సంచలనాత్మక విజయాలు నమోదు చేశారు. కామన్వెల్త్ గేమ్స్ సహా పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించి భారత జెండాను ఎగురవేశారు. నిలకడైన ప్రదర్శన, అంకితభావంతో సాగిన ఆమె కెరీర్లో ఈ అర్జున అవార్డు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుంది.
మరోవైపు తెలంగాణకు చెందిన యువ డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ సాధించిన విజయం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది. పుట్టుకతో వచ్చిన వినికిడి లోపాన్ని ఏమాత్రం ఆటంకంగా భావించకుండా, షూటింగ్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వినికిడి లోపాన్ని అధిగమించి డెఫ్లింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సాధించి దేశ కీర్తిని సమున్నతంగా నిలిపారు. ధనుష్ కేవలం డెఫ్ పోటీలకే పరిమితం కాకుండా సాధారణ అంతర్జాతీయ షూటింగ్ పోటీల్లో కూడా పాల్గొని తన సత్తా చాటారు. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించి.. భారతదేశం గర్వించదగ్గ షూటర్గా ఎదిగారు. ఆయన చూపిన పట్టుదల, క్రమశిక్షణ నేటి యువతకు గొప్ప స్ఫూర్తిని అందిస్తున్నాయి.
2025 జాతీయ క్రీడా పురస్కారాలలో భాగంగా మొత్తం 17 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను అర్జున అవార్డుకు ఎంపిక చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నిరంతరంగా అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు మైదానంలో ప్రదర్శించే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, అసాధారణ క్రీడాస్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ పురస్కారాలకు క్రీడాకారులను ఎంపిక చేస్తుంది.
హైదరాబాద్కు చెందిన ఇద్దరు యోధులు ఒకే ఏడాది అర్జున అవార్డు దక్కించుకోవడం పట్ల తెలంగాణ క్రీడా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ క్రీడా సంఘాలు, క్రీడాభిమానులు గాయత్రి గోపిచంద్, ధనుష్ శ్రీకాంత్లకు సాదర అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాలు రాష్ట్రం నుంచి మరిన్ని నూతన ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు.
