ఏలూరు వైసీపీ ముందుకా.. వెనక్కా.. !
ఆళ్ల నాని 2024 ఎన్నికల ఓటమి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
By: Garuda Media | 19 Sept 2026 9:00 PM ISTఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందుకా.. వెనక్కా.. అనే చర్చ సాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర మార్పులు, కొత్త వ్యూహాల మధ్య సాగుతున్నాయి. గతంలో ఇక్కడ సుదీర్ఘకాలం పార్టీని నడిపిన బలమైన నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరణించ డం, పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను కొత్త నాయకత్వానికి అప్పగించడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.ప్రస్తుత ఏలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజకీయాలు ఏమేరకు బలంగా ఉంటాయన్నది ప్రశ్న.
ఆళ్ల నాని 2024 ఎన్నికల ఓటమి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత 2025లో తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా, ఇటీవల ఆయన కన్నుమూశారు.ఆయన పార్టీని వీడిన తర్వాత వైసీపీ అధిష్టానం మామిడిపల్లి జయప్రకాష్ను ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ విషయంలో మామిడిపల్లి వెనుకబడ్డారన్న చర్చ సాగుతోంది.
ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకం. ఇన్ఛార్జ్ మామిడిపల్లి ఆధ్వర్యంలో ఇటీవల వైసీపీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఓటరు జాబితాల సవరణలపై వారు దృష్టి సారించారు. నియోజకవర్గంలో వైఎస్ విగ్రహాల ఏర్పాటుకు ప్రయత్నించి భంగ పడ్డారు. ఇక, స్థానిక సమస్యలపై అధికార కూటమి కి వ్యతిరేకంగా నిరసనలు తెలిపినా పొలిటికల్ మైలేజ్ రాలేదు.
ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ సామాజిక సమీకరణాలు(ముఖ్యంగా కాపు, ఇతర వెనుకబడిన వర్గాల ఓటర్లు) కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నియోజకవర్గంలో బలంగా ఉండటంతో, వారిని ఢీకొట్టేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ జయప్రకాష్ గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ను ఏకం చేయడానికి శ్రమిస్తున్నారు. కానీ, ఆయన దూకుడు పెద్దగా ఫలించడం లేదని చెబుతున్నారు. దీనికితోడు ఆళ్ల వర్గం పూర్తిగా టీడీపీకి మద్దతు ఇస్తోంది. ఇలా.. ఏలూరు వైసీపీలో రాజకీయం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుండడం గమనార్హం.
