బిహార్ ఎన్నికల్లో ఏఐ వాడకంపై ఈసీ హెచ్చరికలు..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఈసీ. సాంకేతికతను వాడుకొని అభ్యర్థులు ఓటర్లను తప్పుదారి పట్టించవద్దని సూచించింది.
By: Tupaki Political Desk | 9 Oct 2025 4:34 PM ISTపెరుగుతున్న టెక్నాలజీ మానవ అవసరాలు తీర్చాలే కానీ పక్కదారి పట్టించకూడదు. ఇలా చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సాంకేతికరంగం ఇటీవల తీసుకువచ్చిన దానిలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) ఒక విప్లవం. దీనితో ఏదైనా క్రియేట్ చేయవచ్చు. రెండు, మూడు నిమిషాల వీడియో క్రియేట్ చేయాలంటే ఏఐ మంచి ప్లాట్ ఫారం. అయితే ఇది మంచికి ఉపయోగిస్తే బెటరే కానీ చెడుకు ఉపయోగిస్తేనే వినాశనం కాగలదు.
ఈ ప్రచారంపై ఈసీ ప్రత్యేక దృష్టి
అయితే ఇదే ఏఐని ఎన్నికల సందర్భంలో అభ్యర్థులు ఎలా ఉపయోగించుకోవచ్చు.. చాలా రకాలుగా వాడవచ్చు. తమ పార్టీ ప్రచారం కోసం వీడియోలు చేసుకోవచ్చు ఇంత వరకు ఒకే.. కానీ ఇతర ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చెడుగా చూపించేందుకు క్రియేట్ చేసి వారి పరువుకు నష్టం కలిగించకూడదు. ఏఐ వాడకంపై ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఫొటోలు, వీడియోలు, డీప్ ఫేక్ ఇమేజెస్ లాంటివి క్రియేట్ చేయడం గురించి వివరించింది.
ప్రత్యేకతను సంతరించుకున్న బిహార్ ఎన్నికలు..
ఈ సారి బిహార్ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ అంశం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉత్కంఠభరితంగా గడిచింది. ఇక షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత నుంచి లెక్కింపు పూర్తయి సీఎం పీఠంపై కూర్చునే వరకు మరింత ఉత్కంఠతగా కొనసాగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈసీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
మర్గదర్శకాలు..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఈసీ. సాంకేతికతను వాడుకొని అభ్యర్థులు ఓటర్లను తప్పుదారి పట్టించవద్దని సూచించింది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సోషల్ మీడియాలో తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, ఈసీ కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం మానుకోవాలని స్పష్టంగా సూచించింది.
డీప్ ఫేక్ లపై వార్నింగ్
ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకునే విషయాలు ఏఐ-జనరేటెడ్ లేదా కల్పితమైనవి అయితే, వాటి గురించి స్పష్టంగా తెలపాలని పేర్కొంది. డీప్ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తలు, వృథా కంటెంట్ ద్వారా ఎన్నికలపై ప్రభావం చూపడం చట్టవిరుద్ధం కావడం మాత్రమే కాదు, ప్రజా విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందని దీనిపై ఈసీ సీరియస్ గా వ్యవహరిస్తుందని హెచ్చరించింది.
సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ
ఈసీ మరో కీలక సూచనలో సామాజిక మాధ్యమాలను నిత్యం పర్యవేక్షిస్తామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం ముఖ్యమని తెలిపింది. గత లోక్సభ ఎన్నికల సందర్భంలో కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈసారి ఏఐ ఆధారిత డేటా, ఫేక్ కంటెంట్ మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
అందరి బాధ్యత
బిహార్ ఎన్నికలు రెండు దశల్లో జరిగనున్నాయి నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబరు 14న ఓట్ల లెక్కింపు. ఈ నేపథ్యంలో, ఎన్నికల సమగ్రతను నిలబెట్టడం ప్రతి పార్టీ, అభ్యర్థి బాధ్యత అని ఈసీ సూచించింది. వాస్తవానికి, సమగ్ర, పారదర్శక ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వాసాన్ని పెంచే కీ అంశం. డిజిటల్ వేదికలు రాజకీయాలను మరింత ప్రాముఖ్యవంతంగా మార్చుతున్నప్పటికీ, ఏఐ నియంత్రణలో ఉంచడం, నిజాయితీతో ఉపయోగించడం అవసరం.
