Begin typing your search above and press return to search.

దుబాయ్‌లో 250 మందికి ఆశ్రయం ఇచ్చిన భారతీయుడు… ‘నిజమైన శ్రీమంతుడు’ అంటూ ప్రశంసలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, దుబాయ్ ఎయిర్‌పోర్టులో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న వందలాది మంది భారతీయులకు రాజస్థాన్‌కు చెందిన ధీరజ్ జైన్ ఒక ఆపద్బాంధవుడిలా కనిపించారు.

By:  Madhu Reddy   |   9 March 2026 8:22 PM IST
దుబాయ్‌లో 250 మందికి ఆశ్రయం ఇచ్చిన భారతీయుడు… ‘నిజమైన శ్రీమంతుడు’ అంటూ ప్రశంసలు
X

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మనిషి అని పెద్దలు చెబుతుంటారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, దుబాయ్ ఎయిర్‌పోర్టులో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న వందలాది మంది భారతీయులకు రాజస్థాన్‌కు చెందిన ధీరజ్ జైన్ ఒక ఆపద్బాంధవుడిలా కనిపించారు. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, తనకున్న వనరులతో వారికి అండగా నిలిచి 'నిజమైన శ్రీమంతుడు' అనిపించుకున్నారు. మానవత్వాన్ని చాటిన ధీరజ్ జైన్ ఉదారత గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ విశేషాలు మీకోసం.

ఆపదలో అండగా నిలిచిన రాజస్థానీ వ్యాపారి:

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీనివల్ల వందలాది మంది భారతీయ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. తినడానికి తిండి, ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న దాదాపు 250 మంది భారతీయుల గురించి తెలుసుకున్న ధీరజ్ జైన్ వెంటనే స్పందించారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన, దుబాయ్‌లోని తన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను వారి నివాసానికి ఇచ్చారు. అపరిచితులైనా సరే, తన దేశస్థులన్నే ఏకైక కారణంతో వారందరికీ తన ఇంటి తలుపులు తెరిచి ఆశ్రయమిచ్చారు.

లగ్జరీ ఫామ్‌హౌస్‌లో 'అతిథి దేవో భవ':

శ్రీమంతులు చాలా మంది ఉంటారు కానీ, కష్టంలో ఉన్నవారికి తన ఆస్తిని పంచుకునే గుణం కొందరికే ఉంటుంది. ధీరజ్ జైన్ కేవలం ఉండటానికి చోటు ఇవ్వడమే కాకుండా, వారందరికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఇక వారు తిరిగి క్షేమంగా ఇండియా చేరుకునే వరకు తన ఫామ్‌హౌస్‌లోనే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతీయ సంస్కృతిలోని 'అతిథి దేవో భవ' అనే సూత్రాన్ని ఆయన విదేశీ గడ్డపై ఆచరించి చూపారు. ఆ 250 మందికి ఆయన ఒక వ్యాపారిలా కాకుండా, ఒక ఆపద్బాంధవుడిలా అండగా నిలిచారు.

ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. నెటిజన్ల ఫిదా:

ధీరజ్ జైన్ చేసిన ఈ గొప్ప పని గురించి తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ఆయనను కొనియాడారు. "నిజమైన శ్రీమంతుడు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, పెద్ద మనసున్నవాడు" అని జైన్‌ను ప్రశంసించారు. ఇక మహీంద్రా చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో నెటిజన్లు ధీరజ్ జైన్ ఉదారతకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. విదేశాల్లో మన భారతీయులు ఒకరికొకరు తోడుగా నిలిచే తీరు చూస్తుంటే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.