Begin typing your search above and press return to search.

ఏటీఎం మిషన్ కు తాళ్లు కట్టి వాహనంతో పెకిలించి.. సినీ ఫక్కీలో చోరీ.. వైరల్ గా మారిన వీడియో..

సినీ ఫక్కీలో ఏటీఎం యంత్రాన్ని చోరీ చేసిన ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

By:  Tupaki Political Desk   |   6 May 2026 1:51 PM IST
ఏటీఎం మిషన్ కు తాళ్లు కట్టి వాహనంతో పెకిలించి.. సినీ ఫక్కీలో చోరీ.. వైరల్ గా మారిన వీడియో..
X

సినీ ఫక్కీలో ఏటీఎం యంత్రాన్ని చోరీ చేసిన ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఏటీఎంలోకి చొరబడి ఏటీఎం మెషిన్ కు తాళ్లు కట్టి.. చోరీ చేసుకెళ్లడం వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నా, ఇది భద్రతా వైఫల్యాలను వేలెత్తి చూపుతోంది. పట్టణాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇలాంటి సాహసోపేతమైన దొంగతనాలకు పాల్పడుతున్నారంటే నేరస్థులు ఎంతగా బరితెగించారు. చట్టాల పట్ల వారికి ఉన్న చిన్న చూపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ వింత దొంగతనం ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గుర్తుతెలియని దుండగులు అత్యంత సాహసోపేతమైన రీతిలో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఐడీఎఫ్‌సీ (IDFC) బ్యాంకుకు చెందిన ఏటీఎం యంత్రాన్ని ఏకంగా వాహనానికి కట్టి ఎత్తుకెళ్లడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

వాహనంతో భారీ స్కెచ్

సాధారణంగా ఏటీఎంలో నగదును దొంగిలించడానికి గ్యాస్ కట్టర్లు లేదంటే ఇతర పరికరాలను వాడుతుంటారు, కానీ ఇక్కడ దొంగలు రూటు మార్చారు. దొంగలు ఒక బోలెరో వాహనాన్ని తీసుకువచ్చి, దానికి బలమైన తాడును కట్టి ఏటీఎం యంత్రాన్ని పెకిలించి లాక్కెళ్లారు. పట్టణంలో జనసంచారం తక్కువగా ఉన్న సమయాన్ని చూసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

రంగంలోకి క్లూస్ టీమ్

ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. దొంగలు ఏ మార్గంలో వెళ్లారు, వాహనం నంబర్ వంటి వివరాల కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. ఆ ఏటీఎం యంత్రంలో దొంగతనం జరిగిన సమయానికి ఎంత నగదు ఉందనే విషయాన్ని బ్యాంక్ అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

భద్రతపై ఆందోళన

బ్యాంక్ ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోవడం, సరైన అలారం వ్యవస్థలు పనిచేయకపోవడమే నేరగాళ్లకు వరంగా మారుతోంది. రాత్రి సమయాల్లో ఏటీఎం సెంటర్ల వద్ద పహారా లేకపోవడం ఇలాంటి వింత దొంగతనాలకు దారితీస్తోంది. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల జరగగా, ఇప్పుడు ధర్మవరంలో ఏకంగా యంత్రాన్నే మాయం చేయడం గమనార్హం.

ఈ తరహా నేరాలు ప్రొఫెషనల్ గ్యాంగ్‌ల పనే అయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో నాకాబందీ నిర్వహించి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.