Begin typing your search above and press return to search.

రేవంత్ సోదరుడి ఆదేశాలతో నాపై నిఘా.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులపై పోలీసుల నిఘా వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది.

By:  A.N.Kumar   |   25 Aug 2026 1:43 PM IST
రేవంత్ సోదరుడి ఆదేశాలతో నాపై నిఘా.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు
X

తెలంగాణ రాజకీయాల్లో ప్రజాప్రతినిధులపై పోలీసుల నిఘా వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు తన కదలికలపై నిఘా ఉంచేందుకు ఒక ఏసీపీ స్థాయి అధికారి పనిచేస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి పలు విమర్శనాత్మక ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చట్టానికి.. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తోందా లేక అధికారంలో ఉన్న రాజకీయ కుటుంబాల ఆదేశాల మేరకు నడుచుకుంటోందా అని ఎంపీ అర్వింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిపై ఈ రీతిలో ఏసీపీ స్థాయి అధికారితో నిఘా పెట్టించడం తీవ్ర అభ్యంతరంకరమని.. ఇది పోలీసు వ్యవస్థ పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.

గత కొంతకాలంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య రాజకీయ విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, పోలీసుల వైఖరి, నేతలపై కేసులు, నిఘా వంటి అంశాలపై ఇరు పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి స్వయంగా నిఘా ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ రావలసిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అర్వింద్ బహిర్గతం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో డీజీపీ సీవీ ఆనంద్ లేదా పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ అంశంపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.