చెరువులైన వీధులు, నడుములోతు నీరు.. రాజధాని మౌలిక వసతులపై ప్రశ్నలు
ఈ పరిస్థితికి ప్రధాన కారణం దశాబ్దాల క్రితం నాటి డ్రైనేజీ వ్యవస్థలను నేటి జనాభాకు తగ్గట్లుగా మార్చకపోవడమే.
By: Madhu Reddy | 24 Aug 2026 8:00 PM ISTఢిల్లీ అనగానే ప్రపంచ వేదికలపై మన దేశ సౌందర్యానికి, ఆధునిక అభివృద్ధికి అద్దం పట్టే మహానగరం గుర్తుకొస్తుంది. కానీ, కొన్ని గంటల వర్షం పడితే చాలు సంగమ్ విహార్ నుంచి జైసింగ్ రోడ్డు వరకు నడుములోతు నీళ్లతో చెరువులను తలపించడం మన పట్టణ ప్రణాళికలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. విమానాలు దారి మళ్లడం, రహదారులు జలమయం కావడం వెనుక కేవలం వర్షం మాత్రమే ఉందా లేదా మన పాలకుల ప్రణాళికారాహిత్యం ఉందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి..
గ్లోబల్ సిటీ బిరుదులు.. చిన్న వర్షానికే స్తంభనలు:
మనం స్మార్ట్ సిటీల గురించి, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, దేశ రాజధానిలో నడుములోతు నీళ్లు నిలిచిపోవడం చూస్తుంటే ఆ మాటలన్నీ ప్రచారానికే పరిమితమా అనే అనుమానం రాకమానదు. ఇక విమానాలు నిలిచిపోవడం, ప్రయాణికులు ఇబ్బంది పడటం అనేది కేవలం ఒక రోజు సమస్య కాదు; ఇది ప్రతి వర్షాకాలంలోనూ పునరావృతమయ్యే ఒక పరిపాలనా వైఫల్యం.
పాతబడిన డ్రైనేజీ.. పరిమితి దాటిన కాంక్రీటైజేషన్ :
ఈ పరిస్థితికి ప్రధాన కారణం దశాబ్దాల క్రితం నాటి డ్రైనేజీ వ్యవస్థలను నేటి జనాభాకు తగ్గట్లుగా మార్చకపోవడమే. నగరం అంతటా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాంక్రీట్ రోడ్లు, బిల్డింగులు కట్టేశారు కానీ, ఆ నీరు బయటకు వెళ్లే దారులను మాత్రం మూసేశారు. ఇక ప్రకృతి ఇచ్చిన వర్షాన్ని సురక్షితంగా బయటకు పంపే నాచురల్ డ్రైనేజ్ మార్గాలను ఆక్రమించేయడం వల్లే ఈ అర్బన్ ఫ్లడింగ్ సమస్య వస్తోంది.
ముందస్తు ప్రణాళికారాహిత్యం ఎవరిది?
వర్షాకాలం రాకముందే డ్రెయిన్లలో పూడిక తీయడం, అడ్డంకులను తొలగించడం అధికారుల కనీస బాధ్యత. అయితే, ప్రతిసారీ వర్షం పడి రోడ్లు మునిగిపోయాక యంత్రాలను దించడం, ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేసి చేతులు దులుపుకోవడం అలవాటైపోయింది. కేవలం వాతావరణాన్ని నిందిస్తూ కాలయాపన చేయడం మానేసి, లోపభూయిష్టమైన నగర నిర్మాణ శైలిని బాగుచేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.
ట్యాక్స్ కడుతున్న పౌరుడికి వర్షం పడినప్పుడు సురక్షితంగా ఇల్లు చేరడం ఒక ప్రాథమిక హక్కు. రాజధాని నగరం ఎదుర్కొంటున్న ఈ నీటి ముంపు సమస్యను కేవలం ఒక తాత్కాలిక ఇబ్బందిగా చూడకుండా, శాశ్వతమైన పట్టణ ప్రాజెక్టుల ద్వారా పరిష్కరించాలి. ఇక డ్రైనేజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఆధునీకరించకపోతే, పర్యావరణ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో ఈ నడుములోతు నీళ్లు ఇంకెంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయో ప్రభుత్వం గుర్తించి చర్యలు చేపట్టాలి అని ప్రజలు కోరుతున్నారు.
