Begin typing your search above and press return to search.

ఇటు కాక్రోచ్ లు.. అటు రైతుల ఎంట్రీ.. ఢిల్లీలో మళ్లీ మంటపుట్టింది..

నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల 'చలో పార్లమెంట్' పిలుపు, లడఖ్ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షలతో ఇప్పటికే హోరెత్తిన ఢిల్లీ వీధులు.. ఇప్పుడు రైతుల రాకతో మరింత వేడెక్కాయి

By:  A.N.Kumar   |   21 July 2026 3:38 PM IST
ఇటు కాక్రోచ్ లు.. అటు రైతుల ఎంట్రీ.. ఢిల్లీలో మళ్లీ మంటపుట్టింది..
X

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఆందోళనలు, నిరసనలకు వేదికగా మారుతోంది. నీట్ పరీక్ష అవకతవకలపై విద్యార్థుల 'చలో పార్లమెంట్' పిలుపు, లడఖ్ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షలతో ఇప్పటికే హోరెత్తిన ఢిల్లీ వీధులు.. ఇప్పుడు రైతుల రాకతో మరింత వేడెక్కాయి. ఒకవైపు విద్యార్థులు, కార్యకర్తల లొల్లి ముగియకముందే.. మరోవైపు రైతులు మళ్లీ ఉద్యమ బాట పట్టడంతో రాజధానిలో రాజకీయ వేడి పరాకాష్టకు చేరింది.

రైతుల ఆగ్రహానికి అసలు కారణం ఏంటి?

భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇప్పుడు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ ధరలకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి అనుమతించే అవకాశాలున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల దేశీయంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని.. స్థానిక మార్కెట్లు తీవ్రంగా నష్టపోతాయని వారు వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టేందుకు వివిధ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

శంభు బార్డర్ వద్ద ఉద్రిక్తత

ఈ పిలుపుతో పంజాబ్, హర్యానా ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద భారీ సంఖ్యలో రైతులు ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు ఢిల్లీకి చేరుకోకుండా అడ్డుకునేందుకు పోలీసులు సరిహద్దుల్లో భారీగా బ్యారికేడ్లు, కంటైనర్లు ఏర్పాటు చేశారు. సరిహద్దు గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

2020–21 నాటి ఘాటు జ్ఞాపకాలు

ప్రస్తుత పరిణామాలు నాటి 2020–21 రైతు ఉద్యమాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నాయి. అప్పట్లో కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు దాదాపు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

తమ పోరాటం పూర్తిగా దేశీయ వ్యవసాయ రంగాన్ని.. రైతుల భవిష్యత్తును కాపాడుకోవడానికేనని, ప్రభుత్వం అమెరికా ఉత్పత్తుల దిగుమతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ఆందోళనల వెనుక కొన్ని విదేశీ శక్తులు లేదా స్వార్థ ప్రయోజన వర్గాల ప్రమేయం ఉందేమోనన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి వరుస నిరసనలతో ఢిల్లీ సరిహద్దులు మళ్లీ రగిలిపోతున్నాయి. మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతుందో లేక ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందో వేచి చూడాల్సిందే..