Begin typing your search above and press return to search.

చెంపపై కొట్టి, జుట్టు పీకి.. అంత సెక్యూరిటీ ఉండే సీఎంనే కొట్టాడంటే?

ఢిల్లీలో ఉదయం తీవ్ర కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

By:  A.N.Kumar   |   20 Aug 2025 11:39 AM IST
Delhi CM Rekha Gupta Attacked During Jan Sunwai
X

ఢిల్లీలో ఉదయం తీవ్ర కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఉదయం 8.05 నుంచి 8.10 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. నిందితుడు రేఖా గుప్తా చెంపపై రెండు సార్లు బలంగా కొట్టడమే కాకుండా ఆమె జుట్టు పట్టి లాగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సీఎంకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

-జన్ సున్వాయ్‌లో దాడి

సాధారణ ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు సీఎం తన అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. అర్జీదారుడిగా వచ్చి, మొదట అరుస్తూ దూషణలకు దిగిన వ్యక్తి, కాసేపట్లోనే ఆమెపై దాడి చేశాడు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడి పేరు రాజేశ్ అని గుర్తించినట్లు సమాచారం.

భద్రతా లోపం?

ముఖ్యమంత్రి రేఖా గుప్తా చుట్టూ ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఆమెకు మూడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. అంతటి భద్రతా వలయంలోనూ, ముఖ్యమంత్రిపై ఆమె స్వగృహంలోనే దాడి జరగడం, దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

రాజకీయ కుట్ర?

ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో చాలా ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, రేఖా గుప్తా ప్రజలతో నేరుగా కలసి వినతులు స్వీకరించడం వంటి పరిణామాలు ఈ దాడికి కారణమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్యాప్తు కొనసాగుతుంది

ప్రస్తుతం నిందితుడు రాజేశ్‌ను పోలీసులు గోప్య స్థలంలో విచారిస్తున్నారు. అతడు దాడికి ఎందుకు పాల్పడ్డాడు, దాని వెనుక వ్యక్తిగత కారణమా లేదా రాజకీయ ప్రేరణా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో “ముఖ్యమంత్రిపై ఇంతటి భద్రతా వ్యవస్థ మధ్య దాడి ఎలా జరిగింది?” అనే ప్రశ్న జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.