'దారుస్సలామ్'కు ఏమైంది? పొలిటికల్ చర్చ!
దారుస్సలామ్.. హైదరాబాద్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ఎంఐఎం పార్టీ కేంద్రకార్యాలయమే దారుస్సలామ్. ఒకప్పుడు .. ఈ కార్యాలయం వచ్చిపోయే వారితోనే కాదు.. పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిండుగా కిక్కిరిసి ఉండేది.
By: Garuda Media | 20 Jun 2026 1:00 AM ISTదారుస్సలామ్.. హైదరాబాద్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ఎంఐఎం పార్టీ కేంద్రకార్యాలయమే దారుస్సలామ్. ఒకప్పుడు .. ఈ కార్యాలయం వచ్చిపోయే వారితోనే కాదు.. పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిండుగా కిక్కిరిసి ఉండేది. తమ సమస్యలు చెప్పుకొనే వారు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే వారు. పార్టీ చీఫ్.. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నా.. లేకపోయినా.. పార్టీ కార్యాలయం మాత్రం నిండుగా కనిపించేది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇక్కడ తిష్ఠవేసుకుని పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి కూడా ఉండేది.
కానీ.. గత రెండు మాసాలుగా దారుస్సలామ్ బోసిపోయిన పరిస్థితిని నెలకొంది. వచ్చేవారు లేరు. వచ్చినా.. ఇక్కడ సమాధా నం ఇచ్చేవారుకూడా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. జాతీయ రాజకీయాలపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. యూపీ సహా.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఎంఐఎం జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేసింది. గతంలో బీహార్లోనూ పార్టీ పోటీ ఇచ్చింది.
దీంతో అసదుద్దీన్.. జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరు ద్దీన్ .. కేవలం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే కనిపిస్తున్నారని సమాచారం. ఎక్కువ భాగం.. విదేశాల్లోనే ఉంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో పార్టీకార్యాలయంలో కార్యక్రమాలు మందగించాయి. అదేసమయంలో వచ్చిపోయే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇదిలావుంటే.. హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల్లో ఎంఐఎం పార్టీకి ఏళ్ల తరబడి తిరుగులేదన్న వాదన తెలిసిందే.
అంతేకాదు.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓవైసీ కుటుంబానికి చెందిన నాల్గవ తరం వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. కానీ, ఆ జాడ కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఇదే పాత బస్తీకి చెందిన మరో పార్టీకి అండగా ఉంటున్నదన్న సమాచంర హల్చల్ చేస్తోంది. దీంతో ఎంఐఎం ప్రభ తగ్గుతోందా? అనేది చర్చకు దారితీసింది. ఇక, జాతీయస్థాయిలో దృష్టి పెట్టినా.. ఎంఐఎంకు అనుకున్నంత మైలేజీ లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది.
ఇలా.. స్థానికంగా దృష్టి పెట్టకపోవడం, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్ననేపథ్యంలో దారుస్సలామ్లో జనాల తాకిడి తగ్గిపోగా.. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీనిని సరిచేసుకుంటారా? లేక... ఇంతే అని వదిలేస్తారో చూడాలి.
