ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్!
గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ నారాయణన్... ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.
By: Raja Ch | 18 Aug 2025 9:02 AM ISTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు(జూలై 21)న ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జరిగిన రాజకీయ చర్చలు, విశ్లేషణల సంగతి ఒకెత్తు అయితే.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది మరింత ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే తరుపున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది.
అవును... జగదీప్ ధన్ ఖండ్ అనూహ్య రాజీనామా తర్వాత ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే చర్చ ఆసక్తిగా మారిన వేళ.. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ చీఫ్ నడ్డా ప్రకటన చేశారు.
ఎవరీ సీపీ రాధాకృష్ణన్?:
తమిళనాడులోని కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఇదే సమయంలో... 2016 - 2019 మధ్య 'ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్'గా సేవలందించారు. అనంతరం 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ నారాయణన్... ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21.
కాగా వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీ వ్యూహంపై ఒక క్లారిటీకి రావొచ్చనే చర్చ అప్పుడే మొదలైపోయింది!
