చాలానా పేరుతో లింక్.. కట్ చేస్తే ఖాతా నుంచి 12 లక్షలు మాయం.. షాకులో ఎమ్మెల్యే..
జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఆయన మొబైల్కు 'ఆర్టీఏ (RTA) చలానా' చెల్లించాలంటూ ఒక మెసేజ్ వచ్చింది..
By: Tupaki Political Desk | 22 March 2026 10:19 AM ISTసైబర్ నేరగాళ్ల తెగింపు ఏ స్థాయికి చేరిందంటే.. సామాన్యులనే కాదు, ఏకంగా ఒక ప్రజాప్రతినిధిని కూడా బురిడీ కొట్టించి లక్షల రూపాయలు ఖాతా నుంచి దోచేశారు. సాంకేతికత (టెక్నాలజీ) పెరిగే కొద్దీ దొంగలు కూడా కొత్త వేషాలు వేస్తున్నారు; నిన్నటి వరకు ఓటీపీల కోసం ఫోన్లు చేసిన వారు, ఇప్పుడు 'ఆర్టీఏ చలానా' అంటూ అధికారిక ముద్రతో వచ్చే లింకులతో మాయాజాలం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కిన తీరును సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.
ఎమ్మెల్యేకే 'చలానా' షాక్..
జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఆయన మొబైల్కు 'ఆర్టీఏ (RTA) చలానా' చెల్లించాలంటూ ఒక మెసేజ్ వచ్చింది.. అది నిజమేనని నమ్మి లింక్ను క్లిక్ చేశారు. అంతే, ఆ ఒక్క క్లిక్తో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 12 లక్షల నగదు క్షణాల్లో మాయమైంది. తాను మోసపోయానని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం సాయం తీసుకుంటున్నారు.
ఏపీకే (APK) ఫైళ్ల ప్రమాదం!
సైబర్ దొంగలు ఇప్పుడు వాడే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ‘ఏపీకే ఫైళ్లు’ చలానాలు, విద్యుత్ బిల్లులు లేదా కేవైసీ అప్డేట్ పేరుతో వీరు పంపే లింకులను క్లిక్ చేయగానే, ఫోన్లో ఒక తెలియని సాఫ్ట్వేర్ (APK) ఇన్స్టాల్ అవుతుంది. ఇది మన ఫోన్పై పూర్తి నియంత్రణ సాధించి, బ్యాంక్ మెసేజ్లు, ఓటీపీలను దొంగలకు చేరవేస్తుంది. ఎమ్మెల్యే బాలరాజు విషయంలో కూడా ఇలాంటి ఒక ‘మాలిషియస్ లింక్’ ద్వారానే దొంగలు ఆయన ఖాతాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అప్రమత్తతే రక్షణ!
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందించారు. సోషల్ మీడియాలో లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింకులు, ఏపీకే ఫైళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం లేదా బ్యాంకులు ఎప్పుడూ ఇలాంటి లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారం అడగవని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా మోసపోతే, వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎమ్మెల్యే బాలరాజుకు జరిగిన ఈ అనుభవం ఒక పెద్ద పాఠం. సైబర్ నేరగాళ్లకు కులం, మతం లేదా హోదాతో సంబంధం లేదు.. వారికి కావాల్సిందల్లా మన 'అజాగ్రత్త క్లిక్' మాత్రమే. చదువుకున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్న వారు కూడా ఇలాంటి మోసాలకు గురవుతున్నారంటే, సైబర్ అవగాహన అనేది ఇప్పుడు ఎంత ప్రాథమిక అవసరమో అర్థం చేసుకోవచ్చు. ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ను అనుమానించడం, అధికారిక యాప్ల ద్వారానే చెల్లింపులు చేయడం ఇప్పుడు మన కనీస బాధ్యత.
