చంద్రబాబు పై బ్రిటీష్ ప్రభుత్వం నిఘా.. తెరపైకి ఆసక్తికర విషయం!
తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా ఏపీ సర్కార్ 'అమరావతి – ఆవకాయ ఫెస్టివల్ - 2026' ను అంగరంగ వైభవంగా ప్రారంభించింది.
By: Raja Ch | 9 Jan 2026 12:01 PM ISTగురువారం నుంచి శనివారం వరకూ పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అమరావతి ఆవకాయ్' చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది! ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా... తెలుగు సినిమా వైభవాన్ని జరుపుకోవడానికి, దాని విజయాలను, అందుకు కారణమైన కళాకారులను స్మరించుకోవడానికి, గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు! ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఆసక్తికర ఓ విషయాన్ని వెల్లడించారు!
అవును... ఆవకాయ అనే ఆంధ్ర వంటక వైభవాన్ని, అమరావతి సంస్కృతిని, తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా ఏపీ సర్కార్ 'అమరావతి – ఆవకాయ ఫెస్టివల్ - 2026' ను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఆవకాయ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు.
తెలుగు హీరోలకు ఉండే క్రేజే వేరు!:
ఇదే క్రమంలో... భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు ఎన్నో ప్రయోగాలు చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు... చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఏఎన్నార్, కృష్ణా, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏపీ నుంచి వచ్చినవారే అని తెలిపారు. ఇక.. బాలకృష్ణ ‘అఖండ తాండవం’ గురించి చెప్పాల్సిన పనిలేదని.. ఆయన అన్ స్టాపబుల్ అని అన్నారు. దేశంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా టాలీవుడ్ హీరోలకు ఉన్న క్రేజే వేరని చంద్రబాబు ప్రశంసించారు.
ఏపీ కంటే మెరుగైన రాష్ట్రం మరొకటి లేదు!:
ఇదే క్రమంలో... బ్లూ వ్యాలీ ఏర్పాటుకు దేశంలో ఆంధ్రప్రదేశ్ ను మించిన రాష్ట్రం మరొకటి లేదని చెప్పిన చంద్రబాబు... విన్ విన్ విధానంలో యూరోపియన్ యూనియన్ తో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా... పీపీపీ విధానంలో 32% ప్రాజెక్టులు రాష్ట్రంలోనే ప్రారంభమైనట్లు కేంద్రం వెల్లడించిందని.. ప్రపంచంలోనే తెలుగుజాతిని నంబర్ వన్ గా నిలపాలనేదే తమ సంకల్పం అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
చంద్రబాబుపై బ్రిటీష్ ప్రభుత్వం నిఘా!:
ఈ సందర్భంగా చంద్రబాబు ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని తెలిపారు. అవును... కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్ లోనే దొరికిందని.. ఇక్కడి నుంచి నిజాం సంస్థానానికి, అక్కడినుంచి లండన్ కు చేరిందని.. ఈ క్రమంలో తాను అప్పట్లో లండన్ ఎగ్జిబిషన్ చూస్తానంటే.. మీరు ఇక్కడి వస్తే కోహినూర్ వజ్రాన్ని డిమాండ్ చేస్తారు అని చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం తనపై ప్రత్యేక ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిందని తెలిపారు. ఈ విషయం వైరల్ అవుతోంది!
