Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్... ముహూర్తం ఫిక్స్ !

ఆనాడు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో దేశంలోని కీలక రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కొందరిని పిలిచి మరీ కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా బీఆర్ఎస్ పేరుని ప్రకటించారు.

By:  Satya P   |   19 April 2026 12:08 AM IST
బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్... ముహూర్తం ఫిక్స్ !
X

భారతీయ రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ అన్నది 2022 లో ఏర్పాటు అయింది. ఆనాడు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో దేశంలోని కీలక రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కొందరిని పిలిచి మరీ కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా బీఆర్ఎస్ పేరుని ప్రకటించారు. ఇక జాతీయ పార్టీ అయింది అని కూడా చెప్పేశారు. నాడు కేసీఆర్ సీఎం కాబట్టి కొంత మంది నాయకులు వచ్చి బీఆర్ఎస్ పేరు మార్పు కర్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అది జరిగిన ఏణ్ణర్థం తేడాలో బీఆర్ఎస్ తెలంగాణాలో అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ ఓటమికి సవాలక్ష కారణాలు ఉంటే అందులో పేరు మార్పు కూడా కీలకం అని గులాబీ నేతలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ అంటేనే అధికారం :

తెలంగాణా రాష్ట్ర సమితిలో లోకల్ ఫీల్ ఉంది. సెంటిమెంట్ ఉంది. ఒక విధంగా టీఆర్ఎస్ అని పేరుతో నడిచినన్నాళ్ళూ విజయాలే దక్కాయి. అది ఉద్యమం అయినా రాజకీయం అయినా గులాబీ పార్టీ నెగ్గింది. కానీ బీఆర్ఎస్ గా ఎపుడైతే మార్చారో నాటి నుంచి వరస పరాజయాలు పట్టుకుని వేధిస్తున్నాయి. 2023 చివరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కలేదు. ఈ మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు, దాంతో ఎందుచ్చిన బీఆర్ఎస్ అని గులాబీ నేతలు అంతా అంటున్నారు. ఆ మాట కేటీఆర్ నోట కూడా ఈ మధ్యనే వచ్చింది. దాంతో పార్టీకి పేరు మార్పు అనివార్యంగా ఉంది.

పార్టీ ఆవిర్భావం వేళ :

ఇక బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ళ ఆవిర్భావ ఉత్సవాలు గత ఏడాది ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా అదే ఊపులో నిర్వహించబోతున్నారు. దాని కంటే ముందు ఈ నెల 20న జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి చేరబోతున్నారు. కేసీఆర్ ఆ సభలో ప్రసంగిస్తారు. ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ గా సాగే ఈ సభలోనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారుతోందని సంకేతాలు ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఆ తరువాత ఈ నెల 25న జరిగే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సభలో అయితే పేరు మార్పుతో తీర్మానం చేస్తారని అంటున్నారు.

ఫ్రీజ్ గడువు పూర్తి :

ఏ రాజకీయ పార్టీ పేరు అయినా మూడేళ్ళ వరకూ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫ్రీజ్ చేయబడుతుంది. ఆ తరువాత వేరే వారికి దానికి ఇచ్చేస్తారు. ఇపుడు ఈ పేరు కోసం కేసీఆర్ కుమార్తె కవిత ప్రయత్నం చేస్తోంది అని ప్రచారం సాగుతున్న వేళ బీఆర్ఎస్ తొందర పడుతోంది తమ అస్థిత్వం అయిన టీఆర్ఎస్ పేరుని దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు దాని కోసం పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించి అక్కడ ఆమోదంతో పాటు తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు అని అంటున్నారు. ఆ ప్రక్రియ పూర్తి అయితే సాధ్యమైనంత తొందరలోనే టీఆర్ఎస్ పేరు గులాబీ పార్టీకి దక్కుతుందని అంటున్నారు. మొత్తానికి గతంలో జరిగిన తప్పులను పొరపాట్లను సరిదిద్దుకుంటూ బీఆర్ఎస్ నేతలు అడుగులు వేస్తున్నారు. మరి ముందున్నవి గులాబీ రోజులేనా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.