వర్క్ ఫ్రం హోం లేదు.. ఐటీ ఉద్యోగికి కొత్త తిప్పలు
కరోనా మహమ్మారి నేర్పిన పాఠాల్లో 'ఇంటి నుంచే పని' (వర్క్ ఫ్రం హోం – WFH) విధానం ఒకటి.
By: A.N.Kumar | 15 Oct 2025 12:14 PM ISTకరోనా మహమ్మారి నేర్పిన పాఠాల్లో 'ఇంటి నుంచే పని' (వర్క్ ఫ్రం హోం – WFH) విధానం ఒకటి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు కంపెనీల ఖర్చు తగ్గింపు, ఉద్యోగుల సమయ ఆదా వంటి ప్రయోజనాలతో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. చాలా ఐటీ కంపెనీలు దీన్ని హైబ్రిడ్ విధానంగా మార్చి, వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే విధంగా అమలు చేశాయి.
అయితే ఇటీవల పలు అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఈ హైబ్రిడ్ విధానాన్ని పూర్తిగా నిలిపివేసి, ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కర్ణాటకలోని కంపెనీలు అక్టోబర్ నుంచే ఈ కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.
* నగర ట్రాఫిక్ – తీరని తలనొప్పి!
ఐటీ ఉద్యోగులకు అత్యంత పెద్ద సమస్యగా తయారైంది నగర ట్రాఫిక్. బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతంలోనే సుమారు 500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే రాష్ట్ర ఐటీ ఆదాయంలో 36 శాతం వస్తుంది. దాదాపు 9.5 లక్షల మంది ఉద్యోగులు రోజూ ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్నారు.
దిగజారుతున్న ట్రాఫిక్ పరిస్థితుల కారణంగా, ఉద్యోగులు రోజుకు కనీసం నాలుగు గంటలు ట్రాఫిక్లోనే గడపాల్సి వస్తోంది. ఈ సమయాన్ని ప్రాజెక్టు పనుల కోసం వినియోగిస్తే కంపెనీల ప్రగతికి మరింత మేలు జరుగుతుందని ఉద్యోగులు, బ్లాక్బక్ సీఈఓ రాజేశ్ యాబజి వంటి ప్రముఖులు వాదిస్తున్నారు.
* నైపుణ్యం కొరతే అసలు కారణమా? కంపెనీల వాదన
హైబ్రిడ్ విధానం రద్దుకు కంపెనీలు తమదైన కారణాలు చెబుతున్నాయి. డబ్ల్యూఎఫ్హెచ్ లేదా హైబ్రిడ్ విధానంలో పనిచేయాలంటే కమ్యూనికేషన్, నిర్ణయాత్మకత, బృంద సమన్వయం, సాఫ్ట్వేర్ టూల్స్పై పూర్తి పరిజ్ఞానం అవసరమని సంస్థలు అంటున్నాయి. కొత్తగా చేరిన ఉద్యోగుల్లో ఈ నైపుణ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే ప్రధాన సమస్యగా గుర్తించారు.
కోడ్స్ ట్రీ టెక్నాలజీస్ ప్రాంతీయ సంచాలకుడు నవీన్ నాయర్ అభిప్రాయం ప్రకారం, కొత్త ఉద్యోగులు తొలి ఐదేళ్లు కార్యాలయాల్లో పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్ చర్చలు, సలహాలు, బృందాత్మక నిర్ణయాలపై అనుభవం పొందుతారు. ఇది ఉద్యోగి, కంపెనీ రెండింటికీ లాభదాయకం. ఐబీఎం, ఇన్ఫోసిస్, మైండ్ట్రీ వంటి అగ్రశ్రేణి సంస్థలు కూడా ఇదే కారణంతో హైబ్రిడ్ విధానాన్ని నిలిపివేశాయి.
* నివాస వ్యయాలు – ఆర్థిక భారం
హైబ్రిడ్ విధానం ఉన్నప్పుడు బెంగళూరులోని నివాస ఖర్చులు భరించలేక చాలా మంది ఐటీ ఉద్యోగులు మైసూరు, తుమకూరు, కోలారు, మండ్య వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు తరలివెళ్లారు. ఇప్పుడు హైబ్రిడ్ విధానం రద్దు కావడంతో, ప్రతిరోజూ 200-300 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది అటు సమయ, ధన వ్యయం మాత్రమే కాకుండా, ఉద్యోగులపై తీవ్ర మానసిక ఒత్తిడికి దారి తీస్తోంది.
* సమగ్ర ప్రణాళికతోనే శాశ్వత పరిష్కారం
ఈ సంక్లిష్ట సమస్యకు ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల సమన్వయంతో కూడిన సమగ్ర ప్రణాళికే పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రహదారుల విస్తరణ, మెట్రో సేవలు, బస్సుల కనెక్టివిటీ పెంపు వంటి చర్యలు వేగవంతం కావాలి. ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త ఐటీ కారిడార్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఐటీ కంపెనీల సమాఖ్య ఇప్పటికే ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది. ఉద్యోగుల సౌకర్యాన్ని, కంపెనీల ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకునే సమతౌల్య విధానం అవసరమని, దీని ద్వారానే ఐటీ రంగం మరింత ప్రగతి సాధిస్తుందని నిపుణుల అంచనా.
