అయోధ్యతో మాకు సంబంధంలేదు: యోగికి బీజేపీ
ఈ విషయంపై జరుగుతున్న రాజకీయాలను లైట్ తీసుకోవాలని, ప్రభుత్వ పరంగా ఇప్పటికే దర్యాప్తు బృందాన్ని నియమించిన నేపథ్యంలో విషయాన్ని అధికారులకు వదిలేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
By: Garuda Media | 6 July 2026 8:00 PM ISTఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమిలో నిర్మించిన బాలరామయ్య ఆలయంలో విరాళా చోరీ వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. దీనిపై వస్తున్న రాజకీయ విమర్శలు.. త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయంతో తమకు కానీ, తమ పార్టీ నాయకులకు కానీ సంబంధం లేదని ఇది పూర్తిగా రామజన్మభూమి ట్రస్టుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొంది.
అంతేకాదు.. విరాళాల చోరీ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు.. స్పందించ రాదని.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కూడా బీజేపీ స్పష్టం చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయంపై జరుగుతున్న రాజకీయాలను లైట్ తీసుకోవాలని, ప్రభుత్వ పరంగా ఇప్పటికే దర్యాప్తు బృందాన్ని నియమించిన నేపథ్యంలో విషయాన్ని అధికారులకు వదిలేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇదే సమయంలో వచ్చే నాలుగు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని కూడా యోగికి తేల్చి చెప్పినట్టు జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం.``ఇది పూర్తిగా ఆలయానికి, ట్రస్టుకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. సీఎం సహా బీజేపీ నాయకులు ఎవరూ ఈ విషయంపై మాట్లాడవద్దు. ఇక నుంచి ఈ వ్యవహారంపై అధికారులు స్పందించేలా చర్చలు తీసుకోవాలి. ఉన్నతాధికారులే ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తారు`` అని బీజేపీ స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
తీగలాగుతున్నా..
మరోవైపు విరాళాల చోరీ వ్యవహారంలో అధికారులు తీగ లాగుతున్నారు. అయితే.. కీలక నిందితులు ఎవరు? అనే విషయం స్పష్టత రాలేదు. ఎవరికి వారు తమకు తెలియదని తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం 8 మందిని అరెస్టు చేసిన అధికారులు ఇక, ముందుకు అడుగు వేయలేక పోతున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో ట్రస్టుతో పాటు బీజేపీకి చెందిన మరో కీలక నేత ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం.
