రామా కనవేమిరా.. అయోధ్య 'దోపిడీ' ట్రస్టుకు ముందే తెలుసు!
ఉత్తరప్రదేశ్లోని రామజన్మభూమిలో సుదీర్ఘ పోరాటం అనంతరం నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత రామమందిరం ప్రతిష్ఠ నడిరోడ్డుపై పడింది.
By: Garuda Media | 29 Jun 2026 9:27 AM ISTఉత్తరప్రదేశ్లోని రామజన్మభూమిలో సుదీర్ఘ పోరాటం అనంతరం నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత రామమందిరం ప్రతిష్ఠ నడిరోడ్డుపై పడింది. ఈ ఆలయాన్ని ప్రారంభించిన కేవలం 20 మాసాల్లోనే నిధుల గోల్మాల్ వ్యవహారం దేశాన్నే కాదు.. ప్రపంచ స్థాయిలోనూ కుదిపేస్తోంది. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్లో అయోధ్యపై కధనం రావడం గమనార్హం. ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, ప్రారంభించిన ఆలయంలో దొంగలు పడ్డారంటూ.. వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇటీవల బాలరామయ్యకు భక్తులు సమర్పించిన కోట్ల రూపాయలు గల్లంతు కావడం, లెక్కలు లేకపోవడం, నగలు కూడా అపహరించడం వంటివి తీవ్ర కలకలం రేపాయి. మొత్తం 12 కోట్ల రూపాయలకు సంబంధించి లెక్కలు సరిపోవడం లేదని అధికారు లు చెబుతున్నారు. కానీ, అనధికారికంగా వందల కోట్ల రూపాయల మేరకు దోపిడీ జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక తర్జన భర్జనల అనంతరం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. మరోవైపు రాజకీయంగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇక, తాజా విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. అయోధ్య బాలరామయ్య ఆలయంలో కోట్ల రూపాయల అవకతవకలు, దోపిడీ వంటి విషయాలు ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్టుకు ముందుగానే తెలుసునని.. కానీ, దీనిని గోప్యంగా ఉంచి.. నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. సీసీ టీవీ ఫుటేజీలను తొలగించడం.. వాటికి అడ్డంగా ఎక్కడ నిలబడాలి..? నగదు దోచుకునే సమయంలో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై ట్రస్ట్లోని ఒకరిద్దరు వ్యక్తులకు ముందుగానే తెలిసిందని అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ శుక్లా గురించి.. ట్రస్టుకు బాగా తెలుసునని అయినా.. అతనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం, ఈ నెల 5నే ఆలయ విరాళాల దొంగతనం వ్యవహారం తమకు తెలిసినా.. పోలీసులకు చెప్ప కుండా కనీసం.. ఫిర్యాదు చేయకుండా వ్యవహరించడం వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయని భావిస్తున్నారు. ''ఈ మొత్తం ఘటనలో ఒక్కరికి మాత్రమే ప్రమేయం ఉందని భావించలేం. ప్రాధమికంగా 8 మందిని నిందితులుగా చేర్చాం. కానీ, విచారణ ప్రక్రియలో అసలు వాస్తలు బయటపడుతున్నాయి. ట్రస్టు సభ్యులు ఈ విషయం తెలిసి కూడా దాచి పెట్టారు'' అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం.
మాటల మంటలు..
రామాలయం నిధుల దుర్వినియోగం.. దోపిడీపై రాజకీయంగా మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ దోపిడీ పార్టీ అని ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ``రాముడి పేరు చెప్పి.. అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు రాముడినే దోచుకున్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు ప్రజలను దోచుకుంటున్నారు`` అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. ``రాముడి భక్తులపై కాల్పులు జరిపిన వారు(రథయాత్ర సమయంలో అప్పటి సీఎం ములాయం సింగ్ యాదవ్ .. పలువురి అరెస్టుకు ఆర్డర్ ఇచ్చారు.) ఇప్పుడు ప్రేమ ఒలక బోస్తున్నారు`` అని విమర్శలు గుప్పించారు.
