Begin typing your search above and press return to search.

భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఢీకొంటే నాశనమే

భూమికి మరోసారి ఆకాశంలో విస్మయం.. అలాగే ఆందోళన కలిగించే పరిణామం చోటుచేసుకోబోతోంది.

By:  A.N.Kumar   |   16 Sept 2025 11:09 AM IST
భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఢీకొంటే నాశనమే
X

భూమికి మరోసారి ఆకాశంలో విస్మయం.. అలాగే ఆందోళన కలిగించే పరిణామం చోటుచేసుకోబోతోంది. శాస్త్రవేత్తల తాజా నివేదికల ప్రకారం 2025 FA22 అనే భారీ గ్రహశకలం త్వరలో భూమికి అత్యంత సమీప దూరంలోకి రానుంది. ఈ గ్రహశకలం సెప్టెంబర్ 18, 2025న ఉదయం 8:33 గంటలకు భూమి పక్కనుగా దూసుకుపోయే అవకాశం ఉందని నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ప్రస్తుతం భూమికి 8,41,988 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చాలా దగ్గర దూరమే అయినప్పటికీ, భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రాకపోవడంతో ఢీకొనే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆస్టరాయిడ్ పరిమాణం, వేగం

ఈ గ్రహశకలం పరిమాణం కూడా విశేషమే. దీని చుట్టుకొలత 163.88 మీటర్లు, పొడవు 280 మీటర్లు. అంతేకాదు ఇది గంటకు 24,127 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోంది. ఇంతటి వేగం కారణంగా దీని కదలికను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సోలార్ రేడియేషన్ ప్రెజర్ లేదా ఇతర అంతరిక్ష పరిస్థితుల వల్ల దీని మార్గంలో మార్పులు చోటు చేసుకోవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

ఆస్టరాయిడ్ల ఉత్పత్తి

అంతరిక్షంలో గ్రహాలతో పాటు దుమ్ము, రాళ్లు కలిసిపడి చిన్నా–పెద్ద గ్రహశకలాలు ఏర్పడతాయి. ఇవి తమదైన మార్గంలో భ్రమణం చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి మార్గం తప్పి గ్రహాలకు చేరువ అవుతుంటాయి. ఇలాంటి పరిణామాలు అనేకసార్లు జరిగినప్పటికీ, చాలా సందర్భాల్లో అవి భూమిని తాకకుండా దాటిపోతాయి.

* భూమికి ముప్పు ఉందా?

2025 FA22 వల్ల భూమికి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని శాస్త్రవేత్తలు ధైర్యం చెబుతున్నారు. కానీ ఇలాంటి ఖగోళ పరిణామాలను విస్మరించకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకోవడం సహజం. అందువల్ల ఇలాంటి గ్రహశకలాల కదలికలను గమనించడం చాలా అవసరం.

శాస్త్రవేత్తల నిశిత పరిశీలన

ప్రస్తుతం నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు ఈ గ్రహశకలం ప్రతి కదలికను ట్రాక్ చేస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆస్టరాయిడ్లు నిజంగానే భూమికి ముప్పు తేవచ్చని భావించి ముందుగానే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

2025 FA22 భూమికి అత్యంత సమీప దూరంలోకి రానున్నప్పటికీ, అది ఎటువంటి ప్రమాదాన్ని కలిగించబోదని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. అయినప్పటికీ ఈ సంఘటన అంతరిక్ష పరిశోధనలో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలవనుంది.