ఏపీలో లోకల్ పండగ... భారీగా పెరుగుతోన్న సీట్లు...!
రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Garuda Media | 25 March 2026 3:18 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భారీ ఎత్తున స్థానాలు పెంచాలని నిర్ణయించింది. తద్వారా.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తును మునిసిపల్శాఖ చేపట్టింది. ఈ క్రమంలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం కూడా చేశారు.
మేలేనా..?
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు.. కౌన్సిలర్ల సంఖ్య 50 శాతం వరకు పెరగనుంది. తద్వారా ఔత్సాహిక యువతకు.. రాజకీయాల్లోకి రావాలనే కొత్తవారికి కూడా భారీ ఎత్తున అవకాశం లభిస్తుంది. రాజకీయంగా చూస్తే.. ఈ పరిణామం కొత్తవారికి చాలా వరకు మేలు చేసే ప్రక్రియే. తద్వారా.. పార్టీల్లో ఉన్న ఆశావహలకు.. అదే విధంగా యువతకు మంచి అవకాశం లభించినట్టు అవుతుంది.
అయితే.. ఇక్కడే మరో కీలక సమస్య కూడా ప్రస్తుతం ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్పొరేట ర్లకు, కౌన్సిలర్లకు ఇచ్చేవేతనాలు.. దాదాపు పదేళ్లుగా పెంచలేదు. అదేవిధంగా వారికి ఇస్తున్న అలవెన్సులు కూడా పెరగకపోవడం గమనార్హం. మరోవైపు.. సభ్యుల సంఖ్య పెరిగితే.. మునిసిపాలిటీలకు వచ్చే ఆదాయం పెరగదు. పైగా ఖర్చులు పెరుగుతాయి. సభ్యుల జీత భత్యాలు.. వారి అలవెన్సులతో పాటు.. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కార్యకలాపాలు పుంజుకుంటాయి.
వీటిని తట్టుకునేందుకు అంతిమంగా.. ఇటు ప్రభుత్వంపైనా.. అటు ప్రజలపైనా ఆయా సంస్థలు ఆధార పడాల్సి ఉంటుంది. ఇప్పటికే పన్నులు సరిగా చెల్లించకపోవడం మునిసిపాలిటీల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక, కార్పొరేషన్ల పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ క్రమంలో వార్డులు, కౌన్సిళ్లు పెంచిన ప్పటికీ.. కొత్త ఆదాయ మార్గాలను పెంచకుండా.. ఆయా సంస్థలను ముందుకు నడిపించే పరిస్థితి అయితే ఉండదు. ముందుగా ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తే.. తర్వాత.. ఎన్ని స్థానాలు పెంచుకున్నా అభ్యంతరం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.
