పరువు కోల్పోతున్న 'మాటల మరాఠీలు'
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచితూచి అడుగులు వేయడమే కాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకు ని మాట్లాడాలి.
By: Garuda Media | 6 Feb 2026 10:36 AM ISTరాజకీయాల్లో ఉన్నవారు.. ఆచితూచి అడుగులు వేయడమే కాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకు ని మాట్లాడాలి. గతంలో మాదిరిగా.. కేవలం ప్రధాన మీడియా మాత్రమే ప్రజలకు చేరువగా లేదు. ఇప్పుడు వాట్సాప్, సహా సోషల్ మీడియా ప్రజలకు చేరువ అయింది. దీంతో నాయకుల వ్యవహారం.. అందరికీ తెలుస్తోంది. తద్వారా.. నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. వారు ఉపయోగిస్తున్న పదాలు వంటివి ప్రజల మనసులో రికార్డు అవుతున్నాయి. ఫలితంగా నాయకుల పరువు గంగలో కలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ
ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాయకుల `మాట`కు విలువ ఉండేది. నాయకులు ఏం మాట్టాడినా .. పది మందికి ఉపయోగకరమైన వ్యాఖ్యలు చేసేవారు. విమర్శించుకున్నా.. ఒక విధానం.. పద్ధతిని అవ లంభించేవారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు కూడా చాలా ఒద్దికగా మాట్లాడేవారు. ఆ తర్వాత.. వచ్చిన టీడీపీ కూడా.. అదే విధానం కొనసాగించింది. కానీ, రానురాను ఈ విధానాలకు అన్ని పార్టీలూ ఎసరు పెడుతున్నాయి. ఫలితంగా మాటల మరాఠీలుగా పేరొందిన నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీకి చెందిన అంబటి రాంబాబు చేసిన దూషణలు .. రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించాయి. ఒక ప్పుడు అత్యంత గోప్యంగా వాడుకునే బూతు పదాలను ఇప్పుడు పబ్లిక్ చేసేశారు. అనేందుకు ఎలా ఉన్నా .. వినేందుకు మాత్రం తీవ్ర ఎబ్బెట్టుగా ఉంటున్నాయని తెలిసి కూడా నాయకులు బరితెగిస్తున్నారు. దీనిలో టీడీపీ నేతలు కూడా తక్కువేం తినలేదు. ఎవరికి వారు తమ దాకా వస్తేనే తడుముకుంటున్నారు. గతంలో టీడీపీ నాయకులు, గతం, ప్రస్తుతంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు ఇలానే ఉన్నాయి.
ఇక, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా వాడు వీడు అని అనేస్తున్న దరిమిలా.. ఇతర నాయకు లు కూడా అదే బాట పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రులంటే ప్రొటోకాల్ ఉంటుంది. వారికి ఒకింత గౌరవం కూడా ఉంటుంది. ఉండాలి. కానీ, ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ హద్దులు మీరి చేసుకుంటున్న విమర్శలు వినేందుకు సగటు పౌరుడికి ఎబ్బెట్టుగానే ఉంటున్నాయి.
తాజాగా మాజీ సీఎం కేసీఆర్ను `వాడు వీడు` అని రేవంత్ రెడ్డి అనడం.. ప్రతిగా బీఆర్ ఎస్ అదే పదజాలం వాడడం తెలంగాణలో దిగజారుతున్న రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. ఇక, జాతి పిత ఎలా అవుతాడు అంటూ.. కేసీఆర్ను రేవంత్ వ్యాఖ్యానిస్తే.. నువ్వు బూతుపితవు అంటూ.. బీఆర్ ఎస్ సేమ్ స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. మరి ఇలా రాజకీయాలు అగ్రనేతలే భ్రష్టుపట్టిస్తే.. ఇక. . పరివారం మాటేంటి? భవిష్యత్తు నేతల మాటేంటి? అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
