ప్రజల నమ్మకానికి కేరాఫ్.. ఏపీ, తెలంగాణ!
ప్రజల నమ్మకానికి, ప్రభుత్వంపై విశ్వాసానికి కేరాఫ్ గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకే వరుసలో నిలబడ్డాయి. తాజాగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక రూపొందించింది.
By: Garuda Media | 13 Dec 2025 11:00 PM ISTప్రజల నమ్మకానికి, ప్రభుత్వంపై విశ్వాసానికి కేరాఫ్ గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకే వరుసలో నిలబడ్డాయి. తాజాగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక రూపొందించింది. దీనిలో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకే తరహాలో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడం విశేషం.
ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే విషయంలో ఏపీ, తెలంగాణ 74 మార్కులతో పదవ స్థానంలో నిలిచాయి. వాస్తవానికి 2022 -21 సమయంలో ఈ రెండు రాష్ట్రాలు 20వ స్థానంలో ఉన్నాయి. అయితే, అనూహ్యంగా రెండు సంవత్సరాల సమయంలోనే పదో స్థానానికి పెరగడం గమనార్హం. ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనంగా మారాయన్నది ఆర్బిఐ చేసిన విశ్లేషణ.
ఏపీ విషయాన్ని తీసుకుంటే.. పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా ప్రజల ఆర్థిక కొనుగోలు శక్తిని పెంచేదిశగా కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందన్నది ఆర్బిఐ పేర్కొన్న ప్రధాన విషయం. అదే విధంగా తెలంగాణలో కూడా ప్రజల ఆదాయాన్ని, ప్రభుత్వాన్ని నడిపించే తీరులో జరుగుతున్న మార్పులను ప్రజలు గమనిస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది.
ఈ రెండు అంశాల్లో కూడా ప్రజలు అత్యంత విశ్వసనీయంగా ఉన్నారని ప్రభుత్వాలపై నమ్మకంతో ఉన్నారని పేర్కొంది. ప్రధానంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకమైంది విద్యుత్ రంగం. ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ విద్యుత్ ధరలను నిలకడగా ఉంచడం, తరచుగా పెంచకుండా పునరుత్పాదక ఇందన మనరులను ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయడం వంటివి కలిసి వస్తున్నాయి. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడం ద్వారా ఇరు రాష్ట్రాలు ఒకే దిశలో అభివృద్ధి చెందుతున్నాయి అని కూడా స్పష్టం చేసింది.
ఇక ఈ జాబితాలో కేరళ, ఉత్తరాఖండ్ ముందు వరుసలో ఉన్నాయి. తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. వీటి తర్వాత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయని రాబోయే 10 సంవత్సరాల్లో మరింతగా అభివృద్ధి చెందుతాయని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే వార్షిక తలసరి ఆదాయం అదేవిధంగా వరి విస్తీర్ణం వంటి విషయాల్లో తెలంగాణ ఒకింత ముందు వరుసలో ఉంది. అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విషయంలో కూడా తెలంగాణ పనితీరు బాగుందని ఆర్బిఐ స్పష్టం చేసింది.
ఏదేమైనా 2047 నాటికి 30 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ, అదే విధంగా 2047 నాటికి ఏపీని ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ఆర్బిఐ నుంచి మంచి మార్కులు పడటం విశేషం.
