హక్కుల కమిటీకి వైసీపీ ఫిర్యాదు.. నాడు-నేడు తేడా ఇదే!
ఈ క్రమంలో జోగి ఇంటిపై పెట్రోల్ సీసా బాంబులను విసరడంతోపాటు.. ఆయన ఇంటిని ధ్వంసం చేయడాన్ని చైర్మన్కు వివరించారు.
By: Garuda Media | 5 Feb 2026 5:00 AM ISTజాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్హెచ్ ఆర్సీ)కి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని .. మాజీ మంత్రుల ఇళ్లకే భద్రత లేకుండా పోయిందని.. ప్రతిపక్షంపై ఉక్కుపాదంతో విరుచుకుపడుతున్నారని.. మానవత్వం నశించిందని వైసీపీ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి చెందిన గుంటూరు జిల్లా ఎస్సీ కార్యకర్త హత్య సహా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు ఇచ్చారు.
ఎన్ హెచ్ ఆర్ సీ చైర్మన్ రామసుబ్రమణియన్ను వైసీపీ ఎంపీలు.. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి తదితరులు కలుసు కున్నారు. ఈ సందర్భంగా 15 పేజీల ఫిర్యాదు లేఖను, పలు ఆధారాలను కూడా అందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణా మాలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. నిజనిర్ధారణ కమిటీని కూడా వేయాలని.. సూచించారు. ప్రధానంగా మాజీ మంత్రులుఅంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎన్ హెచ్ ఆర్ సీ చైర్మన్కు అందించారు. వైసీపీ నేతలను లేకుండా చేయాలన్న వ్యూహాత్మక దాడి అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో జోగి ఇంటిపై పెట్రోల్ సీసా బాంబులను విసరడంతోపాటు.. ఆయన ఇంటిని ధ్వంసం చేయడాన్ని చైర్మన్కు వివరించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. ఇది అధికారికంగా మంత్రి చెప్పిన మాట అంటూ చైర్మన్ తెలిపారు. ఈసందర్భంగా వారు గతంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల వీడియోలను కూడా ఆయన అందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కాగా.. ఈ వివరాలను పరిశీలించిన చైర్మన్.. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్టు వైవీ సుబ్బారెడ్డి మీడియాకు చెప్పారు.
నాడు..ఏవగింత!
వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ను వేధించినప్పుడు.. పవన్ కల్యాణ్ను విశాఖ పట్నంలోకి అడుగు పెట్టకుండా.. హోటల్కు పరిమితం చేసినప్పుడు.. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు ను అడ్డుకున్నప్పుడు.. టీడీపీ శ్రేణులు ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అదేసమయంలో అమరావతి రాజధాని కోసం రైతులు ఉద్యమించినప్పుడు వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు అనికూడా చూడకుండా.. లాఠీ చార్జి చేశారు. ఈ విషయాలను కూడా అప్పట్లో ఎన్హెచ్ ఆర్సీకి పలువురు రైతులు తీసుకువెళ్లారు. అయితే.. అప్పట్లో వైసీపీ నాయకులు ``ఎన్ హెచ్ ఆర్సీ ఏమైనా పుడుంగా?`` అని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు అదే సంస్థకు తమ గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం.
