అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీనా.. ?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కుమార్తె మౌనిక.. రాజకీయంగా చర్చకు వచ్చారు.
By: Garuda Media | 3 Feb 2026 7:00 PM ISTవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కుమార్తె మౌనిక.. రాజకీయంగా చర్చకు వచ్చారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలు.. అనంతరం జరిగిన పరిణామాలపై సోమవారం ఆమె మీడియా ముందుకు వచ్చారు. వాస్తవానికి ఈ సమయంలో తన తండ్రి చేసింది కరెక్టేనని ఆమె చెబుతారని.. అందరూ భావించారు. కానీ, ఆమె ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలను తాను సమర్ధించడం లేదన్నారు. ఇదే సమయంలో తమ రక్షణను ఆమె ప్రశ్నించారు.
అయితే.. వాస్తవానికి ఇప్పటి వరకు అంబటి కుటుంబం ఎప్పుడూ.. మీడియా ముందుకు రాలేదు. పైగా.. ఆ ఇంట్లో నుంచి మహిళలు ఇప్పటి వరకు రాజకీయాలపై స్పందించింది కూడా లేదు. గత ఎన్నికల సమయంలో అంబటి అల్లుడు చేసిన వాట్సాప్ వీడియోలు మాత్రమే.. పెద్ద సంచలనం రేపాయి. ఆ తర్వాత.. తొలిసారి అంబటి కుమార్తె మౌనిక మీడియా ముందుకు రావడం.. తన తండ్రి అరెస్టు, జైలును ఆమె ఖండించకుండా.. తమ రక్షణ కోరుకోవడం వంటివి చర్చకు వచ్చాయి.
వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో గతంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె, ఇటీవల రంగా కుమార్తె ఆశా కిరణ్ వంటివారే కనిపించారు. అయితే.. వారు కూడా సమయం చూసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబటి కుమార్తె మౌనిక బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె రాజకీయంగా అడుగులు వేస్తారో.. లేదో తెలియదు కానీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన మాట తీరు, పద్ధతి, విధానం .. రియాక్ట్ కావడం వంటివి చక్కగా అమరాయని అంటున్నారు పరిశీలకులు.
నేటి తరం రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మౌనిక వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ వారుసు రాళ్లు తక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి నారాయణస్వామి కుమార్తె గంగా ధర నెల్లూరు నుంచి పోటీ చేశారు. అంతకుమించి.. వారసురాళ్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో అంబటి కుమార్తె కనుక రాజకీయాల్లో వస్తే.. ఒకింత ఆశించిన మేరకు పుంజుకునే అవకాశం ఉంటుంది.
