అల్లు అర్జున్ మామకు షాక్.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
నానక్రామ్గూడలోని ‘మంత్రీ కాస్మోస్’ భవన ప్రాంగణానికి సంబంధించిన వివాదంలో ఆయనతో పాటు మరికొందరిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
By: A.N.Kumar | 15 Sept 2026 6:18 PM ISTహైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చోటుచేసుకున్న భూవివాదం ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, వ్యాపారవేత్త చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నానక్రామ్గూడలోని ‘మంత్రీ కాస్మోస్’ భవన ప్రాంగణానికి సంబంధించిన వివాదంలో ఆయనతో పాటు మరికొందరిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భూవివాదం నేపథ్యంలో వివాదం
‘మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్’ ప్రతినిధుల ఫిర్యాదు ప్రకారం.. నానక్రామ్గూడలోని కాస్మోస్ భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించి ఆక్రమణకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో భవనం ప్రాంగణంలోని గేట్ల తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారని, అక్కడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ విధులను నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించడంతో పాటు వారిని భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా వ్యవహరించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ ఘటనలో చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉందని పేర్కొంటూ ఆయనతో పాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలు
ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను కూడా అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలను పెన్డ్రైవ్లో భద్రపరిచి గచ్చిబౌలి పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అంతేకాకుండా నానక్రామ్గూడ ఐటీ కారిడార్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అక్కడ నివసిస్తున్న వారికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీకి కూడా ఫిర్యాదు ప్రతులను పంపినట్లు అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.
భూమికి సంబంధించిన వివాదమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అసలు వివాదం ఏమిటి? భూమిపై ఎవరి హక్కులు ఉన్నాయి? ఘటన సమయంలో అక్కడ ఏం జరిగింది? అనే అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
చంద్రశేఖర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం ఫిర్యాదుదారుల వాదనల ఆధారంగానే ఉన్నాయి. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారం సినీ ప్రముఖుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కలిగి ఉండటంతో ప్రస్తుతం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది.
