Begin typing your search above and press return to search.

ఏ320లో సంక్షోభానికి కారణం కారణం అదేనా..? ఆశ్చర్యం కల్పిస్తున్న కంపెనీ ప్రకటన..

యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ద్వారా వెలువడిన ఈ హెచ్చరికలు, అంతరిక్ష వాతావరణం (Space Weather) మానవ సాంకేతిక వ్యవస్థలపై ఎంతటి ప్రభావం చూపగలదో స్పష్టం చేస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   29 Nov 2025 10:29 AM IST
ఏ320లో సంక్షోభానికి కారణం కారణం అదేనా..? ఆశ్చర్యం కల్పిస్తున్న కంపెనీ ప్రకటన..
X

అంతర్జాతీయ విమానయాన రంగంలో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద విమాన తయారీ సంస్థల్లో ఒకటైన ఎయిర్‌బస్‌కు చెందిన ప్రముఖ మోడల్ ఏ320 (Airbus A320) లో తలెత్తిన సాంకేతిక లోపం, భారతీయ విమానయాన సంస్థలతో సహా అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్య కేవలం హార్డ్‌వేర్ వైఫల్యం కాదు.. అంతరిక్షంలోని సౌర వికిరణం (Solar Radiation) ప్రభావంతో విమాన నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతినడం దీనికి కారణం కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఇది ఆధునిక ఏవియేషన్ సాంకేతికతకు ఎదురైన ఊహించని సవాలుగా నిలుస్తోంది.

సౌర రేడియేషన్

యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ద్వారా వెలువడిన ఈ హెచ్చరికలు, అంతరిక్ష వాతావరణం (Space Weather) మానవ సాంకేతిక వ్యవస్థలపై ఎంతటి ప్రభావం చూపగలదో స్పష్టం చేస్తున్నాయి. ఎయిర్‌బస్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఏ320 మోడల్ విమానాలలో సౌర వికిరణం కారణంగా ఫ్లైట్ కంట్రోల్ యూనిట్‌ (Flight Control Unit - FCU)కు సంబంధించిన కీలక డేటా దారుణంగా దెబ్బతింది. ఈ FCU అనేది విమానం దిశ, ఎత్తు, వేగాన్ని నియంత్రించే కీలకమైన పరికరం. ఈ డేటాలో లోపం ఏర్పడితే.. పైలట్లు విమానంపై నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను కేవలం ‘సాఫ్ట్‌వేర్ బగ్’గా కొట్టిపారేయడానికి వీల్లేదు.. ఇది భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం.

ఎయిర్‌బస్ అంచనా ప్రకారం.. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 వేల ఎయిర్‌బస్ విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ అవసరం. ఈ భారీ సంఖ్య, ప్రపంచ ఏవియేషన్ పరిశ్రమలో ఏ320 మోడల్ విస్తృత వినియోగాన్ని తెలియజేస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు సాఫ్ట్‌వేర్‌లో తక్షణ మార్పులు చేయాలని, కొన్ని సందర్భాల్లో హార్డ్‌వేర్ మార్పులు తప్పవని కంపెనీ ప్రకటించింది. ఈ మరమ్మతులు పూర్తయ్యే వరకు, భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఆ విమానాలను పూర్తిస్థాయిలో వినియోగించడం కష్టమేనని కంపెనీ చెప్తోంది.

దేశీయ విమానయాన రంగంపై ప్రభావం..

భారతీయ విమానయాన రంగంపై ఈ సమస్య పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రధాన సంస్థలైన ఇండిగో (IndiGo), ఎయిరిండియా (Air India), ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) వద్ద ఏ320 మోడల్ విమానాల సంఖ్య గణనీయంగా ఉంది. అందిన సమాచారం ప్రకారం.. భారతీయ సంస్థల వద్ద ఉన్న మొత్తం 560 ఏ320 విమానాలలో సుమారు 200 నుంచి 250 విమానాలలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. దేశీయ విమానయాన ప్రయాణంలో సింహభాగాన్ని ఆక్రమించే ఈ సంస్థల సర్వీసుల్లో ఈ స్థాయిలో అంతరాయం కలగడం అంటే, రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో విమాన ప్రయాణాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం తప్పనిసరి. ఎయిర్‌ఫ్రాన్స్ (Air France) తమ 35 విమాన సర్వీసులను రద్దు చేయగా, కొలంబియన్ ఎయిర్‌లైన్ అవియాంకా (Avianca) తమ సర్వీసుల్లో ఏకంగా 70 శాతం ప్రభావితమయ్యాయని ప్రకటించింది. ఈ అంతర్జాతీయ ఉదాహరణలు, మన దేశీయ సంస్థలు ఎదుర్కోబోయే సవాలు తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.

సంస్థల స్పందన..

సమస్య తీవ్రతను గుర్తించిన ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు వేగంగా స్పందించాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు, దీని కారణంగా విమాన సర్వీసుల షెడ్యూల్‌లో మార్పులు లేదంటే అంతరాయాలు ఉండవచ్చని ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు. కానీ సంస్థ కూడా కచ్చితంగా ఎన్ని సర్వీసులపై ప్రభావం పడుతుందో సంఖ్యను వెల్లడించలేదు. ఈ రహస్యం పాటిస్తున్న తీరు, తమ కార్యకలాపాలపై పడే ప్రభావాన్ని తగ్గించి చూపెడుతుందన్న అనుమానం కలుగుతోంది.

ఈ వ్యవహారం ఏవియేషన్ భద్రతా నమూనాపై కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

డిజైన్ లోపం..

అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించబడిన ఏ320 వంటి విమానాలు, భూమికి లక్షల మైళ్ల దూరంలో ఉన్న సౌర వికిరణం కారణంగా ఎలా దెబ్బతిన్నాయి? ఈ ముప్పును ఎయిర్‌బస్ డిజైన్ దశలో ఎందుకు పరిగణించలేదు?

అప్‌గ్రేడ్ వేగం..

200 నుంచి 250 విమానాలకు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ లో మార్పులు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఈ ప్రక్రియ ఆలస్యమైతే, పండుగ సీజన్లలో లేదంటే సెలవు దినాల్లో ప్రయాణించే పౌరులకు కలిగే ఇబ్బందులకు ఎవరు బాధ్యత వహిస్తారు?

ఖర్చుల భారం..

ఈ భారీ మరమ్మతులు, అప్‌గ్రేడేషన్ ఖర్చులను ఎవరు భరిస్తారు? ఎయిర్‌బస్సా లేక విమానయాన సంస్థలా? అంతిమంగా ఈ భారం టికెట్ ధరల రూపంలో ప్రయాణికులపై పడుతుందా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ద్వారానే, ఈ తాత్కాలిక సంక్షోభం నుంచి విమానయాన రంగం దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వం వైపు అడుగులు వేయగలుగుతుంది. ప్రయాణీకుల భద్రత అనేది ఏవియేషన్ రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఎయిర్‌బస్, దేశీయ విమానయాన సంస్థలు ఈ సమస్యను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించి, ప్రయాణికులకు కలిగే ఇబ్బందిని కనిష్ఠ స్థాయికి తగ్గించాలి.