Begin typing your search above and press return to search.

దెబ్బ మీద దెబ్బ.. పాక్ ను ఎండగట్టేలా ఆఫ్గాన్ లో డ్యామ్.. వివరాలివే!

ఇప్పటికే సైనిక చర్యలతో పాకిస్థాన్ కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఆఫ్గాన్.. తాజాగా ఆ దేశాన్ని ఎండగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది

By:  Raja Ch   |   24 Oct 2025 8:00 PM IST
దెబ్బ మీద దెబ్బ.. పాక్ ను ఎండగట్టేలా ఆఫ్గాన్ లో డ్యామ్.. వివరాలివే!
X

పాకిస్థాన్ కు ఆఫ్గనిస్థాన్ సర్కార్ గ్యాప్ ఇవ్వకుండా షాకులిస్తుంది. ఇప్పటికే సైనిక చర్యలతో పాకిస్థాన్ కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఆఫ్గాన్.. తాజాగా ఆ దేశాన్ని ఎండగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌ కు నీటిని పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆఫ్గన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.

అవును... పాకిస్తాన్‌ తో నీటి పంపిణీపై భారతదేశం తీసుకున్న నిర్ణయం తర్వాత తాజాగా ఆఫ్గనిస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్తాన్, పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చిన తర్వాత.. మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ నీటిని పంచుకునే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌ కు నీటిని పరిమితం చేయాలని ఆఫ్గాన్ యోచిస్తోందని ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా... కునార్ నదిపై సాధ్యమైనంత త్వరగా ఆనకట్ట నిర్మించాలని తాలిబన్ సుప్రీం నాయకుడు మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశించారు. సరిహద్దు యుద్ధంలో వందలాది మంది మరణించిన తర్వాత తాజాగా ఈ ప్రకటన వచ్చింది.

ఈ సందర్భంగా... కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని.. ఈ విషయంలో విదేశీ కంపెనీల కోస చూడకుండా.. దేశీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ అఖుండ్జాదా మంత్రిత్వ శాఖను ఆదేశించారని ఆఫ్గన్ జల, ఇంధన మంత్రిత్వ శాఖ 'ఎక్స్' లో వెల్లడించింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఆఫ్గన్ జర్నలిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు!:

ఈ సందర్భంగా స్పందించిన లండన్‌ కు చెందిన ఆఫ్గన్ జర్నలిస్ట్ సమీ యూసఫ్‌ జాయ్ మాట్లాడుతూ.. భారతదేశం తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ నీటి సరఫరాను పరిమితం చేయడం ఆఫ్గనిస్తాన్ వంతు కావచ్చని అన్నారు. పాకిస్తాన్ లోకి ప్రవహించే కాబూల్, కునార్ నదులు చాలా కాలంగా ఆ దేశానికి నీటి వనరుగా ఉన్నాయని తెలిపారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌, పంజాబ్ కు దెబ్బ!:

కాగా... 480 కి.మీ పొడవున్న కునార్ నది ఈశాన్య ఆఫ్గనిస్తాన్‌ లోని హిందూ కుష్ పర్వతాలలో, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న బ్రోగిల్ పాస్ సమీపంలో ఉద్భవించింది. ఇది కునార్, నంగర్హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి పాకిస్తాన్‌ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోకి ప్రవహిస్తుంది. అక్కడ జలాలాబాద్ నగరానికి సమీపంలో కాబూల్ నదిలో కలుస్తుంది. ఈ కునార్‌ నదిని ను పాకిస్తాన్‌ లో ‘చిత్రాల్ నది’ అని పిలుస్తారు.

కునార్ నది కలిసే కాబూల్ నది.. ఆఫ్గన్, పాకిస్తాన్ మధ్య అతిపెద్ద సరిహద్దు నది. ఇది అటాక్ సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. ఇది పాకిస్తాన్ యొక్క నీటిపారుదల, ఇతర నీటి అవసరాలకు.. ముఖ్యంగా దాని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ కు చాలా ముఖ్యమైనది. కునార్ నది నీటి ప్రవాహం తగ్గడం సింధు నదిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.. తద్వారా పంజాబ్‌ ను కూడా అది దెబ్బతీస్తుంది.