Begin typing your search above and press return to search.

భక్తికి వయసు అడ్డంకి కాదు: 116 ఏళ్ల వృద్ధురాలి అద్భుత తిరుమల కాలిబాట యాత్ర

"వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే..." ఈ మాటను మనం తరచూ వింటూనే ఉంటాం.

By:  A.N.Kumar   |   4 July 2026 11:58 PM IST
భక్తికి వయసు అడ్డంకి కాదు: 116 ఏళ్ల వృద్ధురాలి అద్భుత తిరుమల కాలిబాట యాత్ర
X

"వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే..." ఈ మాటను మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులపై ఓ వృద్ధురాలు ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు. తిరుమలేషుడిపై ఉన్న అచంచలమైన భక్తి ముందు వృద్ధాప్యం తలవంచక తప్పలేదు. ఏకంగా 116 ఏళ్ల వయసులో ఆ వృద్ధురాలు అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన కొండెక్కిన అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల భక్తులను, నెటిజన్లను అబ్బురపరుస్తున్నాయి.

మనవళ్లతో కలిసి కాలినడకన ప్రయాణం

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. సదరు వృద్ధురాలి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళగా తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేది ఆమె జీవితకాల కోరిక. అయితే వాహనాల్లో సులభంగా కొండపైకి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, స్వామివారిపై ఉన్న భక్తితో కాలినడకనే వెళ్తానని ఆమె తన కుటుంబ సభ్యులకు మొండికేసారు. ఆమె కోరికను గౌరవించిన మనవలు, మనవరాలు ఆమెకు తోడుగా నిలిచి తిరుమల కాలిబాట యాత్రను ప్రారంభించారు.

మోకాళ్ల పర్వతంపై చెరగని సంకల్పం

అలిపిరి మార్గంలో అత్యంత కఠినమైనదిగా భావించే మోకాళ్ల పర్వతం ప్రాంతాన్ని సైతం ఆమె ధీటుగా అధిగమించారు. వయసు పైబడటం వల్ల నడవడానికి కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించినా ఆమె కళ్లలో మాత్రం వెనకడుగు వేసే ఆలోచనే కనిపించలేదు. మధ్యమధ్యలో కుటుంబ సభ్యులు చేయి అందిస్తూ ఆసరాగా నిలిచినప్పటికీ.. చాలా చోట్ల ఆమె స్వయంగా మెట్లు ఎక్కుతూ ముందుకు సాగడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె పట్టుదలను చూసి తోటి భక్తులు సైతం "గోవిందా.. గోవిందా.." అంటూ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

ఆమె మనవడు మాట్లాడుతూ "మా అమ్మమ్మకు శ్రీవారిని కాలినడకన దర్శించుకోవాలని చాలా కాలంగా బలమైన కోరిక ఉంది. ఈ వయసులో ఆమె సంకల్పాన్ని చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఆమె కోరికను నెరవేర్చడంలో మేమంతా భాగస్వామ్యమవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం." అని తెలిపారు.

నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో

ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "భక్తికి, సంకల్పానికి వయసుతో పనిలేదని ఈ తల్లి నిరూపించింది" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఈ కాలంలో 60 ఏళ్లకే నడవలేకపోతున్నారు, కానీ 116 ఏళ్ల వయసులో ఈమె ఇంత ధైర్యంగా మెట్లు ఎక్కుతున్నారంటే ఆమె జీవనశైలి, క్రమశిక్షణే కారణం" అని మరికొందరు కొనియాడారు. "గోవిందుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే" అంటూ భక్తులు కామెంట్లు పెడుతున్నారు.

భక్తికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక

ఆమె వయసు నిజంగా 116 ఏళ్లేనా అనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు బయటకు రానప్పటికీ, ఆ శతాధిక వృద్ధురాలి ముఖంలో కనిపించిన తేజస్సు, భక్తి భావం మాత్రం వంద శాతం నిజం. శారీరక బలహీనతలను సైతం మానసిక దృఢత్వంతో జయించి, శ్రీవారి చెంతకు చేరిన ఈ వృద్ధురాలి యాత్ర ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తిరుమల చరిత్రలో ఈ సంఘటన భక్తి, సంకల్పం, ఆత్మవిశ్వాసానికి ఒక సజీవ ప్రతీకగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.