Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌కు రేపే శ్రీకారం!

టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్న విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు రేపు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Jun 2026 5:07 PM IST
టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌కు రేపే శ్రీకారం!
X

టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్న విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు రేపు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి స‌క్సెస్‌లు సాధించాయి. ఇక ఈసారి నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా జత కావడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా అనిల్ రావిపూడితో కళ్యాణ్‌రామ్‌కు ఇది రెండో సినిమా కావడం విశేషం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పటాస్ అప్పట్లో కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ స‌క్సెస్‌గా నిలిచింది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారుతో సాహు గారపాటి- అనిల్ రావిపూడి కాంబో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ పనిచేయడం ఇదే మొద‌టిసారి. తన సంగీతంతో సౌత్ తో పాటు నార్త్‌లోనూ గుర్తింపు పొందిన జివి ప్రకాశ్, ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు.

ఇప్పటివరకు వరుసగా తొమ్మిది స‌క్సెస్‌ల‌ను అకౌంట్ లో వేసుకున్న అనిల్ రావిపూడి, కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు పెట్టింది పేరుగా నిలిచారు. ఆడియ‌న్స్ ను నవ్వించడంలోనూ, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను థియేటర్లకు రప్పించడంలోనూ ఆయనకు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. దీంతో వెంకటేశ్‌తో ఆయన చేస్తున్న ఐదో చిత్రం, కళ్యాణ్‌రామ్‌తో రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల సమాచారం ప్రకారం, ఈ కథలో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను అనిల్ రావిపూడి సమతుల్యంగా మేళవించినట్లు తెలుస్తోంది. మాస్‌కు కావాల్సిన ఎంట‌ర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.

రేపటి పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన సినిమాల్లో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్‌, కళ్యాణ్‌రామ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు, అనిల్ రావిపూడి వంటి స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కలిసి వస్తుండటంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.