Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి రాకముందే చేదు అనుభవం.. అసలు నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

తెలుగు బుల్లితెరపై తన మార్క్ యాంకరింగ్‌తో దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను ఏలిన గ్లామరస్ యాంకర్ ఉదయభాను.

By:  Madhu Reddy   |   18 Sept 2026 11:59 AM IST
రాజకీయాల్లోకి రాకముందే చేదు అనుభవం.. అసలు నిజాలు బయటపెట్టిన ఉదయభాను!
X

తెలుగు బుల్లితెరపై తన మార్క్ యాంకరింగ్‌తో దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను ఏలిన గ్లామరస్ యాంకర్ ఉదయభాను. సినిమాల్లో నటించి, ఇటీవల నిర్మాతగా మారిన ఆమె ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారని పేరుంది. కొద్దిరోజులుగా ఉదయభాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రాజకీయ ఆఫర్ల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కోరిన సీటు ఇస్తామన్నారు కానీ...:

రాజకీయాల్లోకి రాకముందే తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఉదయభాను స్పష్టం చేశారు. గతంలోనే ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి తనకు నేరుగా పిలుపు వచ్చిందని తెలిపారు. తాను కోరుకున్న నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆ పార్టీ పెద్దలు ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. అయితే, ఆ టికెట్ ఆఫర్ వెనుక వారు ఒక ఊహించని షరతు కూడా విధించారని చెప్పారు.

రూ. 100 కోట్లు ఉంటేనే టికెట్:

ఎమ్మెల్యే సీటు కావాలంటే కనీసం రూ. 100 కోట్లు దగ్గర ఉంచుకోవాలని, ఆ మొత్తాన్ని ఎన్నికలు పూర్తయిన ఏడాదిన్నరలోనే మళ్లీ సులభంగా సంపాదించుకోవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చారట. ఇక ఆ సంఖ్య వినగానే తనకు మైండ్ బ్లాక్ అయిందని ఉదయభాను చెప్పారు. రూ. 100 కోట్లు అనేది ఎమ్మెల్యే టికెట్‌కు కేవలం బేసిక్ అర్హత మాత్రమేనని చెప్పడం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని ఆమె ఎమోషనల్ అయ్యారు.

రూపాయి ఆశించకుండా ప్రచారం చేస్తానన్నా వినలేదు:

తన దగ్గర అంత పెద్దమొత్తం లేదని స్పష్టం చేసినట్లు ఉదయభాను తెలిపారు. డబ్బుతో కూడుకున్న రాజకీయాలు చేయడం కంటే ప్రజాసేవ ముఖ్యమని నమ్మే తాను, ఆ ఆఫర్‌ను వినయపూర్వకంగా తిరస్కరించానని చెప్పారు. ఇక రూపాయి కూడా ఆశించకుండా నిజాయితీగా ఏ నియోజకవర్గంలోనైనా పార్టీ తరపున ఉచితంగా ప్రచారం చేస్తానని కోరినా ఆ నాయకులు అంగీకరించలేదని గుర్తుచేసుకున్నారు.

పార్టీ పేరు చెప్పకుండా సస్పెన్స్:

తనను అంత పెద్ద మాట అన్న ఆ రాజకీయ పార్టీ ఏది అనే వివరాలను మాత్రం ఉదయభాను బయటకు చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ప్రస్తుతం పొలిటికల్ స్పేస్‌లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత ఎంతలా పెరిగిపోయిందో చెప్పడానికి ఉదయభాను చేసిన ఈ కామెంట్స్ నిదర్శనంగా నిలిచాయి.

టివి గ్లామర్, ప్రజాదరణ ఉన్నప్పటికీ డబ్బు రాజకీయాలకు లొంగకుండా నిజాయితీగా ఉండేందుకే ఉదయభాను మొగ్గు చూపారని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. రాజకీయం అంటే వ్యాపారం కాదని, సేవ మాత్రమేనని ఆమె నమ్మి తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.