ఆ హీరోలు ఏకంగా బడ్జెట్ నే రెమ్యునరేషన్ గా..: ఉదయభాను
టాలెంట్ ఉన్నా ఛాన్స్ దొరకడం కష్టం.. కానీ ఎక్కడ తలుపులు మూసుకున్నా తన ప్రొడక్షన్ సంస్థ తలుపులు మాత్రం తెరిచే ఉంటాయని అంటున్నారు నటి, నిర్మాత ఉదయభాను.
By: M Prashanth | 9 Sept 2026 8:00 PM ISTటాలెంట్ ఉన్నా ఛాన్స్ దొరకడం కష్టం.. కానీ ఎక్కడ తలుపులు మూసుకున్నా తన ప్రొడక్షన్ సంస్థ తలుపులు మాత్రం తెరిచే ఉంటాయని అంటున్నారు నటి, నిర్మాత ఉదయభాను. కొత్త కథలు, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే టార్గెట్ తో ముందుకెళ్తున్న ఆమె.. పంచనామా వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. కొంతమంది హీరోలు అడిగిన రెమ్యునరేషన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామా సిద్ధమైంది. కోలీవుడ్ నటుడు భరత్ లీడ్ రోల్ లో నటించిన ఆ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మోహన్ శ్రీవత్స్ దర్శకత్వం వహించిన ఆ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే మంచి హైప్ సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత ఉదయభాను.. ఆ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఎదురైన అనుభవాలను వివరించారు.
పంచనామా కథను అనుకున్న తర్వాత హీరో భరత్ ను సెలెక్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదని ఉదయభాను తెలిపారు. షూటింగ్ ను కేవలం 15 రోజుల్లో ప్రారంభించాల్సిన పరిస్థితి ఉండటంతో పలువురు హీరోలను సంప్రదించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఓటీటీలో మంచి గుర్తింపు ఉన్న నటులను సంప్రదించామని వెల్లడించారు. అయితే కొంతమంది హీరోల నుంచి వచ్చిన రెస్పాన్స్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఉదయభాను అన్నారు.
కథ, కాన్సెప్ట్ నచ్చిందని చెప్పిన కొందరు ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పారు. మరికొందరు ఏకంగా సిరీస్ కు అయ్యే మొత్తం బడ్జెట్ ను తమ రెమ్యునరేషన్ గా అడిగారని వెల్లడించారు. అంత బడ్జెట్ ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని ఆలోచించకుండా అలా అడిగారని అన్నారు. అలాంటి సమయంలో హీరో భరత్ మాత్రం ఒక్క మెసేజ్ కు స్పందించారని ఉదయభాను చెప్పారు.
ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లగలిగామని తెలిపారు. మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే పంచనామాను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ఇక తన కెరీర్ గురించి కూడా ఉదయభాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన జర్నీ ప్రారంభించానని తెలిపారు. తనకు ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని, పెద్ద స్టూడియో లేదని చెప్పారు.
12 ఏళ్ల వయసు నుంచే మైక్ పట్టుకుని తన కెరీర్ ను ప్రారంభించినట్లు ఉదయభాను గుర్తుచేసుకున్నారు. జీవితంలో ఎన్నిసార్లు కిందపడినా అంతేసార్లు పైకి లేచి నిలబడ్డానని చెప్పారు. ఉదయభాను ప్రొడక్షన్స్ ద్వారా కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఉన్న కథలను తెరకెక్కించడమే తన లక్ష్యమని చెప్పారు. టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి తన సంస్థ ప్లాట్ ఫామ్ గా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. "ఎక్కడ ఎవరికైనా అవకాశం రాకపోయినా నా దగ్గర తలుపులు తెరిచే ఉంటాయి. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఏ డోర్ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్ తలుపు తెరిచే ఉంటుంది" అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
