అయిపోయాడు అన్నారు.. డెడ్ ఎండ్లో రికార్డుల మోత!
రణ్ వీర్ సింగ్ `దురంధర్` రికార్డుల మోత గురించి నిన్న మొన్నటివరకూ చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికీ కొన్నిచోట్ల థియేటర్లలో ఆడుతోంది.
By: Sivaji Kontham | 23 Jan 2026 9:26 AM ISTరణ్ వీర్ సింగ్ `దురంధర్` రికార్డుల మోత గురించి నిన్న మొన్నటివరకూ చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికీ కొన్నిచోట్ల థియేటర్లలో ఆడుతోంది. బాలీవుడ్ లో అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్లలో కొన్ని రికార్డులను బ్రేక్ చేయలేదు. అయినా దురంధర్ సంచలన విజయం సాధించడం బాలీవుడ్ కి కొత్త ఊపు తెచ్చింది. ఇప్పుడు దురంధర్ రికార్డులను బ్రేక్ చేసే సినిమా వస్తుందా? అన్న చర్చ సాగుతోంది.
ఇంతలోనే ఇప్పుడు `దురంధర్` అడ్వాన్స్ బుకింగుల రికార్డును బ్రేక్ చేస్తోంది అంటూ వెటరన్ హీరో సన్నీడియోల్ బోర్డర్ 2 గురించి హైప్ చేయడం హాట్ టాపిగ్గా మారింది. బాక్సాఫీస్ వద్ద బోర్డర్ 2 ప్రకంపనలు సృష్టిస్తోందని, ఈ రోజు (జనవరి 23) విడుదలైన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్లో భారీ రికార్డులను నమోదు చేసిందని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురించింది. ఆల్మోస్ట్ అయిపోయాడు.. ఇక కోలుకోవడం కష్టమే అనుకున్న హీరో అనూహ్యంగా గదర్ 2 తో రీబూట్ అయ్యాడు. ఇప్పుడు బోర్డర్ 2తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు వస్తున్నాడు. డెడ్ ఎండ్లో అతడు ఎలాంటి రికార్డుల మోత మోగిస్తాడో చూడాలనే ఉత్సుకత పరిశ్రమ వర్గాల్లో అభిమానుల్లో ఉంది.
బోర్డర్ 2 అడ్వాన్స్ బుకింగుల పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల టిక్కెట్ల అమ్మకాలతో సెన్సేషన్ సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ.12.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఇటీవలే విడుదలైన `ధురంధర్` అడ్వాన్స్ బుకింగ్స్ సుమారు రూ.9 కోట్లు. ఈ రికార్డును బోర్డర్ 2 అధిగమించింది. గదర్ 2తో పోలుస్తూ ఇప్పుడు `బోర్డర్ 2` గురించి చర్చ మొదలైంది. బోర్డర్ 2 అద్భుతమైన నంబర్లను సాధించినా కానీ, సన్నీ డియోల్ గత చిత్రం `గదర్ 2` రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయింది. `గదర్ 2` మొదటి రోజుకు ముందే ఏకంగా రూ.17.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ను సాధించింది. ఆ స్థాయిని అందుకోవడంలో బోర్డర్ 2 కొంచెం వెనకబడింది.
నటీనటుల వివరాల్లోకి వెళితే.. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి తదితరులు ఈ చిత్రంలో నటించారు. అనురాగ్ సింగ్నే ఈ చిత్రానికి దర్శకుడు. 1971 భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలోని చిత్రమిది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉమ్మడి ఆపరేషన్ ని తెరపై చూపిస్తున్నారు. భూషణ్ కుమార్, జె.పి. దత్తా ఈ సినిమాని నిర్మించారు.
ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని కొన్ని మీడియాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సన్నీ డియోల్ నటన, వరుణ్ ధావన్ యాక్షన్, దిల్జిత్ దోసాంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలంగా నిలిచాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సెలవులు ఉండటంతో ఈ వీకెండ్లో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయిపోయాడు అనుకున్న హీరో ఇప్పుడు ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో రికార్డుల మోత మోగించడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.
