పవర్పేటతో సత్తా చాటాలని చూస్తున్న కృష్ణ చైతన్య
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సందీప్ కిషన్ మరోసారి పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 27 Feb 2026 2:43 PM ISTటాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సందీప్ కిషన్ మరోసారి పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరీర్ ఆరంభంలోనే ప్రస్థానం లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందీప్, తరువాత తెలుగు, తమిళ భాషల్లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరుచుకున్నారు. సందీప్ ఇంకా స్టార్ స్టేటస్ ను అందుకోకపోయినా, స్టోరీ సెలక్షన్ విషయంలో అతను తీసుకునే రిస్క్లు ఆయనను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. గతేడాది విడుదలైన మజాకా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఈసారి మరింత స్ట్రాంగ్ కంటెంట్తో రావాలని సందీప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య
ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమా పవర్ పేటపై ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ డ్రామా కథలో సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్న కృష్ణ చైతన్యపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కృష్ణ చైతన్య తన కెరీర్లో చేసిన సినిమాలు కమర్షియల్ గా మిక్డ్స్ రిజల్ట్స్ ను అందుకున్నప్పటికీ, కథనంలో ఉన్న డెప్త్, క్యారెక్టర్ డిజైన్ లో చూపే నైపుణ్యం వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
గత కొన్నాళ్లుగా స్క్రిప్ట్ పై వర్క్
రౌడీ ఫెలో మూవీలో సమాజంలోని అసమానతలను వినూత్నంగా చూపించిన ఆయన, చల్ మోహన్రంగ సినిమాలో ఎమోషన్స్ కు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు పవర్ పేట మూవీతో మరింత మెచ్యూర్డ్, రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్క్రిప్ట్పై గత కొంతకాలంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ, పాత్రల్ని బలంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది.
70ఎంఎం బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమా
మొదట ఈ కథను మూడు భాగాలుగా తెరకెక్కించాలని ఆలోచించినప్పటికీ, కథను కుదించి మరింత ఇంపాక్ట్ కలిగేలా ఒకే పార్ట్గా రూపొందించాలనే నిర్ణయం తీసుకోవడం కూడా డైరెక్టర్ క్లారిటీకి నిదర్శనమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్కు టెక్నికల్గా కూడా మంచి టీమ్ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ గా రితికా నాయక్
ఈ మూవీలో హీరోయిన్ గా మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అశోకవనంలో అర్జున కల్యాణం, హాయ్ నాన్న సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం యూత్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు రితికా. ఇక సందీప్ కిషన్ డిజిటల్ ప్రాజెక్ట్స్తో కూడా బిజీగా ఉన్నారు.
ఆయన నటిస్తున్న సూపర్ సుబ్బు త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తమిళ స్టార్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న సిగ్మా సినిమాలోనూ నటిస్తున్నారు. మొత్తానికి కథను బలంగా నమ్మే డైరెక్టర్ కృష్ణ చైతన్య, ప్రయోగాలకు వెనుకాడని హీరో సందీప్ కిషన్ కలయికలో రాబోతున్న పవర్ పేట ఒక కంటెంట్ డ్రివెన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇద్దరికీ కెరీర్లో కీలక మలుపు కావొచ్చని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
