Begin typing your search above and press return to search.

లీగ‌ల్ వివాదంలో మ‌హేష్‌ హీరోయిన్‌!

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన న‌ట‌న‌తో, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న న‌టి సొనాలి బెంద్రే.

By:  Ravindar Gorantla   |   2 April 2026 11:00 PM IST
లీగ‌ల్ వివాదంలో మ‌హేష్‌ హీరోయిన్‌!
X

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన న‌ట‌న‌తో, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న న‌టి సొనాలి బెంద్రే. తెలుగులో మ‌న్మ‌థుడు, మురారి, ఇంద్ర‌, ఖ‌డ్గం, ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల‌తో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న సొనాలి బెంద్రే గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తోంది. రీసెంట్‌గా ఆమె ఫ్యామిలీ లీగ‌ల్ వివాదంలో చిక్కుకుంది. సొనాలి బెంద్రే, ఆమె భ‌ర్త గోల్డీ బెహ‌ల్ అక్ర‌మంగా త‌న వ్య‌వ‌హ‌సాయ భూమికి ఆక్ర‌మించుకున్నార‌ని రైతు చంద్ర‌కాంత్ షిండే సివిల్ కోర్టుని ఆశ్ర‌యించాడు.

దీంతో సొనాలి బెంద్రే ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. వివాదాల‌కు దూరంగా ఉండే సొనాలి బెంద్రే ఇలా వివాదంలో చిక్కుకోవ‌డం ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని షాక్‌కు గురి చేస్తోంది. ఇంత‌కీ వివాదం ఏంటీ? ఎలా మొద‌లైంద‌ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. పూణె జిల్లా మావ‌ల్ ప్రాంతానికి చెందిన రైతు చంద్ర‌కాంత్ షిండే కుటుంబానికి 1957 నుంచి వార‌స‌త్వంగా వ‌స్తున్న 30 గుంట‌ల భూమి ఉంద‌ట‌. దాన్ని సొనాలి బెంద్రే, ఆమె భ‌ర్త గోల్డీ బెహ‌ల్ అక్ర‌మంగా కొనుగోలు చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గోల్డీ బెహ‌ల్ అక్ర‌మంగా భూమిని స్వాధీనం చేసుకోవ‌డ‌మే కాకుండా త‌మ హ‌క్కుల‌ను ప‌ట్టించుకోలేద‌ని వాపోయాడు. ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ వ‌డ‌గావ్ మావ‌ల్ సివిల్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కోర్టుకు స‌మ‌ర్పించిన పిటీష‌న్‌లో 32000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిలో అక్ర‌మంగా నిర్మాణం కూడా చేస్తున్నార‌ని ఆరోపించాడు. త‌న భూమిని ఆక్ర‌మంగా ఆక్ర‌మించుకోవ‌డ‌మే కాకుండా త‌మ కుటుంబాన్ని బెదిరిస్తున్నార‌ని పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు వెల్ల‌డించాడు.

దీంతో సొనాలి బెంద్రే ఫ్యామిలీ చుట్టూ వివాదం మొద‌లైంది. నెట్టింట వివాదం వైర‌ల్ కావ‌డంతో సొనాలి బెంద్రే స్పందించింది. తాజా వివాదంపై వివ‌రణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అక్ర‌మంగా త‌న 30 గుంట‌ల స్థ‌లాన్ని సొనాలి బెంద్రే ఫ్యామిలీ ఆక్ర‌మించుకుందంటూ రైతూ చంద్ర‌కాంత్ షిండే చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని కొట్టి పారేసింది. ఆమె న్యాయ‌వాదులు కూడా ఈ ఆరోప‌ణ‌ల‌ని తీవ్రంగా ఖండించారు. భూమి కొనుగోలు ప‌త్రాల్లో అత‌ని పేరు ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేశారు.

చంద్ర‌కాంత్ షిండే చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని, డ‌బ్బుల కోస‌మే త‌ను ఇలా అబ‌ద్దాల‌ని ప్ర‌చారం చేస్తున్నాడ‌ని, దురుద్దేశ్యంతోనే అస‌ల్య ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని ఆరోపించారు. సొనాలి బెంద్రే త‌రుపు న్యాయ‌వాది రాజు షిండే మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదే అంశంపై చంద్ర‌కాంత్ షిండే త‌హ‌సీల్దార్‌, స‌బ్ డివిజ‌న్ ఆఫీస‌ర్ ద‌గ్గ‌ర ప‌లు మార్లు ఫిర్యాదులు చేశాడ‌ని, అవ‌న్నీ తిర‌స్క‌రించ‌బ‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. అయితే ఈ కేసుని విచారించిన కోర్టు సొనాలి బెంద్రే, గోల్డీ బెహ‌ల్‌ల‌తో పాటు మ‌రి కొంత మందిని ప్ర‌తివాదులుగా చేర్చింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.