వదినమ్మ చైతన్య కోసమే ఈ వంటకాలు చేసారా? శోభితకు ప్రశ్న!
అక్కినేని కోడలు, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియా క్వీన్ గా అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 2 Sept 2026 10:44 AM ISTఅక్కినేని కోడలు, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియా క్వీన్ గా అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ప్రత్యేకమైన ఫోటోషూట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తనదైన మార్కు వెరైటీ స్టైల్, తత్వంతో కూడుకున్న ఆలోచనలు కలగలసిన ఈ పోస్ట్ అభిమానులను, సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో రోజువారీ వర్కౌట్ల కోసం శోభిత ఎంతగా శ్రమిస్తారో అర్థమవుతోంది. అదే సమయంలో ఇంట్లో తయారు చేసిన రుచికరమైన ఆంధ్రా భోజనం.. సాధారణ సెల్ఫీలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ పోస్ట్ తో ఒక వైపు స్టార్ హోదాను అనుభవిస్తూనే మరోవైపు ఎంత సాధారణంగా ఉండవచ్చో శోభిత నిరూపించారు.
ఈ పోస్ట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన ముఖ్య విషయం.. శోభిత తన మూలాలను మర్చిపోకుండా ప్రదర్శించిన తీరు... పళ్లు తోముకోవడానికి సాంప్రదాయకంగా వాడే వేప పుల్లతో ఉన్న ఫోటోగ్రాఫ్ నెటిజనుల్లో పెద్ద చర్చగా మారింది. అలాగే ముద్దపప్పు, బంగాళాదుంప వేపుడు వంటి ఉత్తరాంధ్ర శైలి భోజనం ఫోటోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి. విదేశాల్లో లేదా పెద్ద వేదికలపై మెరిసే నటి అయి ఉండి కూడా తన ప్రాంతపు అలవాట్లను, సంప్రదాయాలను షేర్ చేయడానికి ఇష్టపడటం చూస్తుంటే.. శోభితపై అభిమానులకు మరింత గౌరవాన్ని పెంచింది.
ఈ పోస్ట్లోని ఫోటోలతో పాటు అదనంగా జోడించిన తత్వచింతన వ్యాఖ్యలు కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ``మనల్ని అర్థం చేసుకోని వారికి వివరణలు ఇస్తూ సమయం వృధా చేసుకోవడం కంటే మౌనంగా ఉండిపోవడమే మేలు`` అనే ఆలోచనపై కామెంట్ సెక్షన్లో పెద్ద చర్చ జరిగింది. ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదనే శోభిత స్వతంత్ర భావాలను, ఆలోచనా విధానంలోని పరిణతిని అభిమానులు ఎంతో సమర్థించారు.
నటుడు నాగచైతన్యతో వివాహం తర్వాత వచ్చిన పోస్ట్ కావడంతో అక్కినేని అభిమానుల నుంచి .. సినీ వర్గాల నుంచి ఈ పోస్ట్కు విశేష స్పందన లభించింది. చైతూ అన్నయ్య చాలా అదృష్టవంతుడు.. వదిన గారు చైతన్య కు వంట చేశారా? అంటూ అభిమానులు సరదా కామెంట్లు చేశారు. తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన సభ్యురాలిగా శోభితను అభిమానులు ఎంతో ఆప్యాయంగా `వదిన` అని సంబోధిస్తూ తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
అంతేకాకుండా.. కామెంట్ సెక్షన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు శోభిత స్వయంగా స్పందిస్తూ చమత్కారంగా సమాధానాలు ఇవ్వడం విశేషం. స్టార్ హోదా ఉన్నా.. అభిమానులతో ఎంతో సరదాగా, స్నేహపూర్వకంగా మాట్లాడటం.. పలకరింపులతో శోభిత వారికి మరింత దగ్గరయ్యారు. ఈ విధంగా ఒక సాధారణ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా శోభిత తన ప్రత్యేక శైలిని, ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
శోభిత ధూళిపాళ్ల 2026లో హిందీ, తెలుగు ప్రాజెక్ట్లతో పాటు డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫారమ్లపై విడుదలయ్యే ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన మలయాళ పీరియడ్ యాక్షన్ యాంటిసిపేటెడ్ మూవీ `కురుప్ 2` కి సంబంధించిన అప్డేట్స్తో పాటు.. తనకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన వెబ్ సిరీస్ `మేడ్ ఇన్ హెవెన్` సిరీస్ తదుపరి విశేషాల గురించిన నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత కూడా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్, సౌత్ చిత్రసీమ రెండింటిలోనూ తనదైన శైలిలో నటిగా ముందుకు సాగుతున్నారు.
