తెలుసు కదా... సిద్దు రీ ఎంట్రీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ ఏడాది ఆరంభంలో జాక్ సినిమాతో వచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు.
By: Ramesh Palla | 16 Sept 2025 2:44 PM ISTస్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ ఏడాది ఆరంభంలో జాక్ సినిమాతో వచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు. టిల్లు వంటి వినోదాత్మక సినిమాతో వచ్చిన సిద్దు ఇలాంటి సినిమాతో వచ్చాడేంట్రా బాబు అంటూ చాలా మంది తీవ్రంగా ట్రోల్ చేసిన విషయం తెల్సిందే. సిద్దు జొన్నలగడ్డ యొక్క అభిమానులు ఆ సమయంలో తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆయన మార్క్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సరికొత్త కథాంశంతో సిద్దు 'తెలుసు కదా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహించడం విశేషం. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ప్రముఖ స్టైలిస్ట్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్న నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ప్రోమో వీడియోలు అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.
ఎక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
ఇప్పటికే 'తెలుసు కదా' సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా అక్టోబర్ 17న విడుదల కాబోతుంది. సరిగ్గా నాలుగు వారాలు ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలతో హీరో ప్రేమ అంటూ హింట్ ఇచ్చారు. మరింత క్లారిటీ ఇస్తూ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వీడియోను విడుదల చేయడం జరిగింది. వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోను సిద్దు జొన్నలగడ్డ తన ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేశారు. గతంలో సిద్దు ఎక్స్ లో ఉండేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఎక్స్ నుంచి సిద్దు బయటకు వచ్చేశాడు. అయితే తన సినిమాల ప్రమోషన్ కోసం, పర్సనల్గా ఫ్యాన్స్కి టచ్లో ఉండటం కోసం అన్నట్లుగా మళ్లీ ఎక్స్ లో సిద్దు జొన్నలగడ్డ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
తెలుసు కదా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సిద్దు జొన్నలగడ్డ ఎక్స్లో మొదటి ట్వీట్లో.. హలో ఎక్స్, నేను మీ.. తెలుసు కదా అంటూ తన ఎక్స్ ఖాతాను పరిచయం చేశాడు. ఇద్దరిని లవ్ చేస్తున్నట్లుగా ఉన్న మరో టీజర్ను సిద్దు ఈ ట్వీట్ కు జత చేయడంతో పాటు అక్టోబర్ 17న సినిమా విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించాడు. సిద్దు షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ సమయంలోనే సిద్దు ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వస్తున్నారు. హీరోలు సోషల్ మీడియాలో లేకుంటే నడవని పరిస్థితి ఉంది. అందుకే స్టార్ బాయ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా మంది పీఆర్ టీం, సినిమా జర్నలిస్ట్లు సిద్దు ఎక్స్ రీ ఎంట్రీకి సంబంధించిన విషయాన్ని తమ టైమ్ లైన్ లో షేర్ చేశారు. సిద్దు ఎక్స్ లో రీ ఎంట్రీ విషయం నెట్టింట వైరల్గా మారింది. ఇది అభిమానులకు ఖచ్చితంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.
టిల్లు క్యూబ్తో రానున్న సిద్దు జొన్నలగడ్డ
అప్పుడెప్పుడో ఇండస్ట్రీలో అడుగు పెట్టినా లక్ కలిసి రాకపోవడంతో 2022 వరకు అవకాశాల కోసం వెతుక్కుంటూ వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు వరుస సినిమాలు చేసే స్టార్ బాయ్ గా అవతరించాడు. హీరోగా మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉన్నా కూడా తక్కువ సినిమాలు చేస్తూ కెరీర్ లో ఎక్కువ విజయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సిద్దు ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. హీరోగా సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం చేస్తున్న మరో సినిమా టిల్లు క్యూబ్. ఈ సినిమాకు సైతం సిద్దు సొంతంగా కథ రాసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఇప్పటికే ఈ సినిమాను నిర్మించేందుకు గాను ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు అధికారికంగా ప్రకటించాడు. తెలుసు కదా సినిమాతో పాటు రాబోయే టిల్లు క్యూబ్ గురించి వరుసగా ఎక్స్ లో కథనాలను సిద్దు పోస్ట్ చేస్తూ ఉంటాడేమో చూడాలి.
