'శంబాల'కు బలం కంటెంట్.. 'ఆది'తో భారీ హిట్ పక్కా: నిర్మాతలు
అయితే తెలుగులో రిలీజ్ అయిన వారానికి హిందీలో విడుదల చేస్తామని తెలిపారు రాజశేఖర్, మహీధర్. ఆదికి హిందీలో మంచి మార్కెట్ ఉండడం వల్ల శంబాలకు కూడా ఆఫర్స్ వచ్చాయని తెలిపారు.
By: M Prashanth | 20 Dec 2025 6:41 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు లీడ్ రోల్ లో నటిస్తున్న శంబాల మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ హారర్ జోనర్ లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు.
ఇప్పటికే శంబాల నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆసక్తి పెంచాయి. ఆడియన్స్ లో సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడగా.. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల అవ్వనుంది. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ కానుండగా.. నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటించి ఇంటరెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
హై క్వాలిటీతో ఫినిష్..
ముందుగా మూవీ స్క్రిప్ట్ కోసం మాట్లాడారు ప్రొడ్యూసర్లు. "స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ బాగా నచ్చింది. డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దిగాం. ముందుగా ఆది సాయి కుమార్ తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆది సాయి కుమార్ తో చేశాం" అని తెలిపారు. అయితే మొదట కొంచెం బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత బడ్జెట్ పెంచి హై క్వాలిటీతో ఫినిష్ చేశామని తెలిపారు.
20 శాతం రికవరీ బ్యాలెన్స్ అంతే!
స్టోరీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి, ఇన్వెస్ట్ చేశామని చెప్పారు. ఈ రేంజ్ లో జనాల్లోకి పోతుందని అనుకోలేదని అన్నారు. అయితే ఇప్పటికే తాము సేఫ్ జోన్ లో ఉన్నామని తెలిపారు శంబాల నిర్మాతలు. "ఇప్పటికే జరిగిన బిజినెస్ తో సేఫ్ జోన్ లోకి వచ్చాం. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా 80 శాతం రికవరీ వచ్చేసింది. ఇంకో 20 శాతం రికవరీ బ్యాలెన్స్ అంతే. థియేట్రికల్ రన్ తో లాభాల్లోకి వస్తామని నమ్ముతున్నాం" అని చెప్పారు.
అది కాస్త ఛాలెంజింగ్ గా..
"OTT, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్ కు ముందే క్లోజ్ అయ్యాయి. మా సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. మా మూవీ చూసి నచ్చి ఆహా వాళ్ళు శంబాల ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ కొంచెం చాలెంజింగ్ అనిపించింది. మైత్రి వాళ్ళు నైజాం రైట్స్ తీసుకున్నారు. ఏపీ, సీడెడ్ ఉషా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు" అని తెలిపారు.
హిందీలో కూడా రిలీజ్..
అయితే తెలుగులో రిలీజ్ అయిన వారానికి హిందీలో విడుదల చేస్తామని తెలిపారు రాజశేఖర్, మహీధర్. ఆదికి హిందీలో మంచి మార్కెట్ ఉండడం వల్ల శంబాలకు కూడా ఆఫర్స్ వచ్చాయని తెలిపారు. హిందీ థియేట్రికల్ రిలీజ్ కూడా చేయడానికి ప్లాన్ చేశామని చెప్పారు. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో శంబాల హిందీ రిలీజ్ ఉంటుందని వెల్లడించారు.
సినిమాకు బలం కంటెంట్!
డైరెక్టర్ షార్ట్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ బాగుంటుందని చెప్పిన నిర్మాతలు.. ఇప్పటికే థియేటర్ లో ఎలా ఉంటుందో చూశారట. చాలా బాగా వచ్చిందని, మొదటి, రెండో షెడ్యూల్ తర్వాత చిత్ర బృందానికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలిపారు. అన్ని ఎలిమెంట్స్ తో చాలా బాగా అవుట్ పుట్ ఇచ్చారని కొనియాడారు. స్టోరీ పరంగా చూస్తే టోటల్ డిఫరెంట్ గా ఉందని, ఏ సినిమాతో దీనికి పోలిక లేదని చెప్పారు. సినిమాకు బలం కంటెంట్ అని పేర్కొన్నారు.
టైటిల్ ఎందుకు పెట్టమంటే?
ఇక టైటిల్ ఎందుకు శంబాల అని పెట్టారో వివరించారు. "కల్కిలో వచ్చిన తరువాత శంబాల అనేది అందరికీ తెలిసింది. శంబాలకు ఓ మీనింగ్ ఉంది. శంబాల ప్లేస్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. మూవీలో హారర్ తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. మైత్రి వాళ్ళు సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పాజిటివ్. హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది" అని చెప్పారు.
శంబాలకు సీక్వెల్?
ఇక సినిమాకు సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా తెలిపారు. "ఫస్ట్ పార్ట్ అయితే ప్రాపర్ గా ఎండ్ చేశాం. సెకండ్ పార్ట్ కోసం స్మాల్ లీడ్ ఇచ్చాం. కొంచెం క్యూరియాసిటీ ఉండేలా క్లోజ్ చేశాం. దాని గురించి మళ్లీ ఆలోచిస్తాం" అని తెలిపారు. ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలతో ముందుకెళ్తున్నామని, అదే సమయంలో డిస్ట్రిబ్యూషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఆదితో కలిసి శంబాలతో హిట్ అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
