యంగ్ హీరోలు సిరీస్ల వెంటపడుతున్నారే!
స్టార్ హీరోలు, టైర్ టు స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు, భారీ క్రేజీ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 4 Feb 2026 10:56 AM ISTస్టార్ హీరోలు, టైర్ టు స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు, భారీ క్రేజీ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయితే మీడియం రేంజ్ హీరోలు, యంగ్ స్టర్స్ మాత్రం ఓటీటీల వెంట పరుగెడుతూ సినిమాలు, సిరీస్లు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది సిరీస్లు చేస్తూ, మరో పక్క సినిమాలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే నవీన్ చంద్ర, నవదీప్, నందు లాంటి హీరోలు చేరిపోయారు. ఇప్పుడు వీరి జాబితాలోకి యంగ్ హీరోలు సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ కూడా చేరిపోతున్నారు.
వీరితో పాటు పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా నేను సైతం అంటూ ఓటీటీ బాటపడుతోంది. థియేట్రికల్ రిలీజ్లకు అలవాటుపడినా కానీ ఓటీటీల్లోనూ సిరీస్లతో ఆకట్టుకోవాలని, ఆ ప్లాట్ ఫామ్ల ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువకావచ్చనే ఆలోచనతో ఇలా యంగ్ హీరోలు, ప్రియాంక, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లలో కీర్తిసురేష్ సినిమాలు, సిరీస్లతో ఓటీటీలోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు ప్రియాంక మోహన్ `మేడ్ ఇన్ కొరియా`తో ఎంటరవుతోంది.
ఇక ఈ ఏడాది యంగ్ హీరోల్లో సందీప్ కిషన్, అనంద్ దేవరకొండ నేరుగా ఓటీటీ తలుపు తట్టేస్తున్నారు. సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ సిరీస్ `సూపర్ సుబ్బు`. ఇందులో మిథిలా పాల్కర్, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీశర్మ, సంపూర్ణేష్ బాబు, గెటప్ శ్రీను నటిస్తున్నారు. మల్లిక్ రామ్ డైరెక్టర్. జాబ్ పర్మినెంట్ కోసం ఓ గ్రామానికి వెళ్లిన హీరో అక్కడ ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథ. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఆనంద్ దేవరకొండ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. తను తొలిసారి నేరుగా ఓటీటీ కోసం సినిమా చేస్తున్నాడు. అదే `తక్షకుడు`. మిడిల్ క్లాస్ మెలోడీస్` మూవీతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వినోద్ అనంతోజు ఈ మూవీకి డైరెక్టర్. `లాపతా లేడీస్` వంటి క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీతో నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న నీతాన్షీ గోయెల్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఓ అంధుడి పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.
ఇందులో ఆనంద్ దేవరకొండ అంథుడిగా కనిపించి ఆకట్టుకోబోతున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో శరణ్య, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉన్న ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తను నటిస్తున్న మూవీ `మేడ్ ఇన్ కొరియా`. కొరియా వెళ్లాలని కలలు కనే ఓ అమ్మాయి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.
