అతడి వల్ల చాలా నేర్చుకున్నాను : రుక్మిణి
నిఖిల్ హీరోగా వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్.
By: Ramesh Palla | 10 Sept 2025 9:00 PM ISTనిఖిల్ హీరోగా వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. ఆ సినిమాకు పెద్దగా ప్రమోషన్ చేయక పోవడంతో పాటు, ముందు నుంచే నెగటివ్ ప్రచారం జరగడం వల్ల సినిమా జనాల్లోకి ఎక్కలేదు. ఆ సినిమా వల్ల టాలీవుడ్లో రుక్మిణి వసంత్కి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ తమిళ్లో ఈమె నటించిన ఎస్, మదరాసి సినిమాల కారణంగా తెలుగులో గుర్తింపు లభించింది. ఆ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్గా నిలువలేదు. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్గా నిలవడం ఖాయం అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తన కెరీర్లోనే అతి పెద్ద రెండు సినిమాలను చేస్తుంది. ఆ సినిమాలు వచ్చిన తర్వాత ఈమె కెరీర్ పూర్తిగా మారడం ఖాయం.
యశ్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా...
మొదటగా యశ్ హీరోగా నటించిన 'టాక్సిక్' సినిమాతో రుక్మిణి వసంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో యశ్ కి జోడీగా నటించడం ద్వారా రుక్మిణి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా నటన విషయంలో ఇప్పటికే చాలా సార్లు తన సత్తా ను చాటింది. తన యొక్క అందం, నటన ప్రతిభ కారణంగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. టాక్సిక్ సినిమా చేస్తున్న సమయంలోనే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ప్రారంభం అయిన డ్రాగన్ సినిమాలోనూ ఎంపిక అయింది. ఎన్టీఆర్తో ఈమె చేస్తున్న సినిమాతో వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా
ఇటీవల ఒక కార్యక్రమంలో టాక్సిక్ సినిమా గురించి రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా యశ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది అంది. అంతే కాకుండా అతడితో కలిసి నటించే ప్రతి నిమిషం చాలా విషయాలను నేర్చుకున్నట్లు చెప్పింది. యశ్ సెట్ లో ఉన్నంత సేపు ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవడం, లోతుగా అధ్యయనం చేసినట్లుగా మాట్లాడటం కనిపిస్తూ ఉంటుంది. అతడు తనకు ఉన్న అనుభవం, జ్ఞానంను సైతం నాతో పంచుకునే వారు, ఆయనతో వర్క్ చేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో ఆయన గొప్ప నటుడిగా నిలవడంకు ప్రధాన కారణం ఈ గుణం అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అంటూ హీరోయిన్ రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే వచ్చిన టాక్సిక్ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్
కేజీఎఫ్ 2 తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన ఇమేజ్కి తగ్గ కథ కోసం చాలా వెయిట్ చేసిన యశ్ ఎట్టకేలకు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్లో రుక్మిణి వసంత్ నటించడం వల్ల ఆమెకు సైతం మంచి క్రేజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. టాక్సిక్ సినిమా హిట్ అయితే సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియాలోనూ రుక్మిణి వసంత్ కి మంచి సినిమా ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాక్సిక్ ఫలితంను పట్టించుకోకుండా ఎన్టీఆర్తో చేస్తున్న డ్రాగన్ సినిమాపై ఆమె దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ తో హిట్ కొడితే రుక్మిణి కచ్చితంగా టాలీవుడ్తో పాటు, పాన్ ఇండియా రేంజ్లో మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది చాలా మంది అభిప్రాయం. ఈ రెండు సినిమాలు రుక్మిణికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది చూడాలి.
