ఆనంద్ చాలా స్మార్ట్.. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనే..: వదినమ్మ
బ్లాక్ బస్టర్ హిట్ బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మూవీ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్.
By: M Prashanth | 5 Sept 2026 9:22 AM ISTబ్లాక్ బస్టర్ హిట్ బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మూవీ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు 90sవెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఎపిక్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి, ఆనంద్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎపిక్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని రష్మిక తెలిపారు. సాధారణంగా తాను కొరియన్ డ్రామాలను ఎక్కువగా చూస్తుంటానని, ట్రైలర్ చూస్తుంటే మంచి రొమాంటిక్ కామెడీ కొరియన్ డ్రామాను చూసినట్టుగా అనిపించిందని చెప్పారు.
సినిమా కూడా మంచి రోమ్-కామ్ గా ఉండబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్ దేవరకొండ తనకు ఈవెంట్ గురించి ముందుగానే మెసేజ్ చేశారని రష్మిక చెప్పారు. తాను హైదరాబాద్ లోనే ఉండటంతో వెంటనే వస్తానని చెప్పి కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. ఆనంద్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు. 'ఆనంద్ చాలా స్మార్ట్. చాలా బాగా మాట్లాడతాడు. కష్టపడి పనిచేస్తాడు' అని ప్రశంసించారు.
ఎపిక్ లో ఫిమేల్ రోల్స్ కు మంచి ఇంపార్టెన్స్ ఉందని ఆనంద్ చెప్పినట్లు రష్మిక వెల్లడించారు. అందుకే వైష్ణవి చైతన్యకు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమాల్లో ఉమెన్ రోల్స్ ను స్ట్రాంగ్ గా రాస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి పాత్రలు ఉంటే తమపై నమ్మకం ఉంచినట్లు అనిపిస్తుందని తెలిపారు దర్శకుడు ఆదిత్య హాసన్ ను చూస్తే చాలా సిగ్గరిలా కనిపిస్తారని, అయితే ఆయన రూపొందించిన ట్రైలర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని రష్మిక అన్నారు.
ట్రైలర్ చూస్తుంటే ఏదో ప్రత్యేకమైన సినిమాను ప్రేక్షకులకు చూపించబోతున్నారనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయని పేర్కొన్నారు. అలాగే సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మంచి పాటలు అందించారని రష్మిక ప్రశంసించారు. ఈవెంట్ లో నటుడు శివాజీని కలవడం ఆనందంగా ఉందన్నారు. పలువురు టాలెంటెడ్ దర్శకులు కూడా ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రస్తుతం తాను రణబాలి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు రష్మిక చెప్పారు. సెప్టెంబర్ 11న ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుందని, మూవీ టీమ్ తో కలిసి సినిమా చూడాలని ఉందని తెలిపారు. సినిమాకు ప్రీమియర్స్ కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఎపిక్ పై అంచనాలు మరింత పెరిగాయి.
