ఆడియన్స్ పిచ్చెక్కిపోతారు! చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి రత్నవేలు కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ఇప్పటికే టాలీవుడ్లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్లలో ఒకటిగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 11 May 2026 12:16 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ఇప్పటికే టాలీవుడ్లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్లలో ఒకటిగా మారింది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతుండగా, తాజాగా సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన రత్నవేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆయన వెల్లడించిన కొన్ని కీలక సన్నివేశాల వివరాలు చూస్తుంటే, పెద్ది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఎమోషన్స్ కు పెద్దపీట వేసిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రత్నవేలు చెప్పిన ప్రకారం, సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను పూర్తిగా ఎమోషనల్గా కనెక్ట్ చేసేలా తెరకెక్కించారట. ముఖ్యంగా రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ, ఆడియన్స్ థియేటర్లలో పిచ్చెక్కిపోయే స్థాయిలో చరణ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే రంగస్థలం తర్వాత మరోసారి గ్రామీణ మాస్ పాత్రలో కనిపిస్తున్న చరణ్, ఈ సినిమాలో పూర్తిగా కొత్త షేడ్స్తో కనిపించనున్నారనే టాక్ బలపడుతోంది. అంతేకాదు, సినిమాలో ఎంతో ఎమోషనల్గా, ఎంతో ఇంపాక్ట్ చూపించే క్రికెట్ మ్యాచ్ ఉంటుందని రత్నవేలు వెల్లడించడం ఆసక్తిని పెంచింది. ఆ క్రికెట్ మ్యాచ్ సీన్ను మొదట పగటిపూట తీయాలని భావించినప్పటికీ, ఎమోషన్ బలంగా కనెక్ట్ కావాలంటే రాత్రి వేళల్లో షూట్ చేయాలని తానే సూచించానని ఆయన చెప్పడం చూస్తుంటే డైరెక్టర్ విజువల్ టోన్పై ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టారో తెలియజేస్తోంది.
ఇక యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే, పెద్దిలో భారీ స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ ఫైట్, రైల్వే యార్డ్లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సమాచారం. అదే సమయంలో, కేవలం సీరియస్ ఎమోషన్స్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా ఫన్ ఓరియెంటెడ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుందని రత్నవేలు చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. దీంతో ఈ సినిమా పూర్తిగా డార్క్ ఎమోషనల్ డ్రామాగా కాకుండా, కమర్షియల్ ఎంటర్టైనర్ టచ్తో ముందుకు సాగుతుందని అర్థమవుతోంది. ఇక సినిమాలో ఓ స్పెషల్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పడం చూస్తుంటే పెద్ది కథలో బుచ్చిబాబు చాలానే ట్విస్టులు, ఎమోషనల్ టర్న్స్ పెట్టినట్టు అర్థమవుతుంది.
ఈ సందర్భంగా రత్నవేలు పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్ర గురించిన వివరాలను కూడా వెల్లడించారు. సినిమాలో ఆమె ఓ ఎమ్మెల్యే కూతురిగా కనిపించనుండగా, ఆ ఎమ్మెల్యే పాత్రను సీనియర్ నటుడు రావు రమేష్ పోషిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా చూస్తే పెద్ది ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివిధ దశల్లో చూపించే ఎమోషనల్ జర్నీగా ఉండబోతోందని రత్నవేలు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా లోని ఎమోషన్ ప్రేక్షకుల మనసుల్లో మిగిలిపోతుందని ఆయన చెప్పడం చూస్తుంటే, బుచ్చిబాబు సాన మరోసారి బలమైన కంటెంట్తో ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
