సీనియర్ నటుడి 450 కోట్ల ఆస్తిపై వారసుల కన్ను?
వెటరన్ స్టార్, హీమ్యాన్ ధర్మేంద్ర(89) మరణం తర్వాత ఇప్పుడు అతడి ఇంట్లో ఆస్తుల రచ్చ గురించి చర్చ మొదలైంది.
By: Sivaji Kontham | 2 Dec 2025 5:00 AM ISTవెటరన్ స్టార్, హీమ్యాన్ ధర్మేంద్ర(89) మరణం తర్వాత ఇప్పుడు అతడి ఇంట్లో ఆస్తుల రచ్చ గురించి చర్చ మొదలైంది. నటుడు, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ రూ. 30,000 కోట్ల ఆస్తుల కోసం సవతులు, వారి వారసుల మధ్య కొట్లాట మొదలైనట్టే, ఇప్పుడు ధర్మేంద్ర వారసుల మధ్య కూడా వివాదం మొదలైనట్టేనని నెటిజనులు ఊహిస్తున్నారు.
ధర్మేంద్ర మరణించి కొద్దిరోజులే అయింది. ఆయన లేని లోటు తీర్చలేనిది. డియోల్ కుటుంబం నుంచి విషాదం, దుఃఖం ఇంకా దూరం కాలేదు. ఇంతలోనే ఆ ఇంట్లో ఆస్తుల రచ్చ మొదలైంది అంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం సాగిస్తోంది. ధర్మేంద్ర ఆస్తుల కోసం డ్రీమ్ గర్ల్ హేమమాలిని కుమార్తెలు ఇషా డియోల్, అహనా డియోల్ కోర్టులో పోరాడతారని ప్రచారం సాగుతోంది. ధర్మేంద్రకు దాదాపు 450 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయి. అందులో వాటా కావాలని కుమార్తెలు కచ్ఛితంగా కోరతారని కూడా కథనాలొస్తున్నాయి.
అయితే ఇలాంటి ప్రచారాన్ని నమ్మాల్సిన పని లేదని, ఆ కుటుంబంలో అసలు ఎలాంటి కలతలు లేవని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ధర్మేంద్ర తన ఆస్తిని, సంపదను తన ఆరుగురు పిల్లలకు ఎలా పంచాలని భావించారో ఎవరికీ ఏమీ తెలియదు. ఆయన భార్యలు ప్రకాష్ కౌర్ - హేమ మాలిని.. వారి వారసుల కోసం ఎలా పంచాలి? అనేది ధర్మేంద్రకు ఒక ప్రణాళిక ఉండి ఉంటుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్కు ఎప్పుడూ విడాకులు ఇవ్వనందున హేమ మాలిని చట్టబద్ధంగా అతడికి భార్య కాదు.. అందువల్ల వారసత్వ హక్కులు పొందలేరని కొందరు వాదిస్తున్నారు.
అయితే ధర్మేంద్ర తన కుమార్తెలకు అన్యాయం చేయరు. ఈషా డియోల్, అహనా డియోల్ కు కూడా తన ఆస్తులను రాసి ఇచ్చి ఉంటారని కూడా కథనాలొస్తున్నాయి. సన్నీ-బాబీ సోదరులు ఈషా-అహానా మధ్య వారసత్వ వివాదాల గురించిన ఈ చెత్త కథనాలు నమ్మవద్దని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కుటుంబంలో వివాదం ఉండదు.. డ్రామాలు ఉండవు.. ధర్మేంద్ర - హేమ మాలిని కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై ఎటువంటి వాదనలు చేయడానికి ఇష్టపడరని కూడా కొందరు చెబుతున్నారు. అలాగని సన్నీడియోల్ వారిని దూరం పెట్టడు. ప్రస్తుతం అతడు తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ఈషా, అహానా వారి తండ్రి కోరుకున్నట్లుగా డియోల్ కుటుంబంలో భాగం అవుతారు! అని ఆ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి చెప్పినట్టు కూడా కథనాలొస్తున్నాయి. వారంతా వెల్ సెటిల్డ్.. అందువల్ల ఆస్తుల కోసం గొడవలకు దిగరని కూడా భావిస్తున్నారు.
అయితే ధర్మేంద్ర మరణం తర్వాత మొదటి భార్య ప్రకాష్ కౌర్ వారసులు వేరుగా, హేమమాలిని కుమార్తెలు వేరుగా సంస్మరణ సభలు నిర్వహించారు. హేమా మాలిని తన ఇంట్లో ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించగా, సన్నీ- బాబీ ముంబైలోని ఒక హోటల్లో సంస్మరణ సభను నిర్వహించారు. దీంతో వారి మధ్య చీలికలు ఉన్నాయని కొందరు సందేహం వ్యక్తం చేసారు. హేమమాలిని ఇంట్లో జరిగిన సంస్మరణ సభకు గోవిందా భార్య సునీతా అహుజా, ఆమె కుమారుడు యశ్వర్ధన్, బోనీ కపూర్ సహా శ్రేయోభిలాషులు వచ్చారు. నటి మధు కూడా హేమమాలిని ఇంటికి వచ్చారు.
బాబీ- సన్నీ నిర్వహించిన సంస్మరణ సభకు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రేఖ, సునీల్ శెట్టి, అభయ్ డియోల్, శర్మన్ జోషి, ఆర్యన్ ఖాన్ తదితరులు వచ్చారు. మొత్తానికి సంస్మరణ సభలను కలిసి నిర్వహించకపోవడంతో ఆ కుటుంబంలో డివైడ్ ఫ్యాక్టర్ గురించి పెద్ద చర్చ సాగింది. ఇదే డివైడ్ ఫ్యాక్టర్ ఆస్తుల తగాదాకు దారి తీయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కొన్నిటికి కాలమే సమాధానం. ఆ ఇంట్లో ఏం జరగబోతోందో తెలియాలంటే కాస్త ఆగాలి.
