నయా ట్రెండ్ భస్మాసుర హస్తం కాదుగా?
భారతీయ సినిమాల్లో నయా ట్రెండ్ మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్లో ఈ ట్రెండ్ దాదాపు పదేళ్ల క్రితమే మొదలైంది.
By: Ravindar Gorantla | 4 April 2026 4:47 PM ISTభారతీయ సినిమాల్లో నయా ట్రెండ్ మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్లో ఈ ట్రెండ్ దాదాపు పదేళ్ల క్రితమే మొదలైంది. `బాహుబలి`కి అప్పట్లో శ్రీకారం చుట్టిన రాజమౌళి ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రాఫిట్ అండ్ షేర్ విధానంలోనే రూపొందించాడు. సరిగ్గా చెప్పాలంటే దక్షిణాదిలో ఈ ట్రెండ్కు నాంది పలికిందే `బాహుబలి`. ఈ మూవీకి పారితోషికంతో పాటు జక్కన్న ప్రాఫిట్ షేర్ పద్దతిలో లాభాల్లో వాటాని తీసుకుని కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాడు. ఆ తరువాత అదే ఫార్ములాని హీరోలు కూడా ఫాలో కావడం మొదలు పెట్టారు.
`సరిలేరు నీకెవ్వరు` సినిమాతో మహేష్ కూడా ఇదే పంథాలో పారితోషికాన్ని తీసుకోవడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం పారితోషికంతో పాటు లాభాల్లో వాటాతో కలిపి మహేష్ రూ.50 కోట్లు తీసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇదే ఫార్ములాని ప్రభాస్ కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆ తరువాత రామ్చరణ్, ఎన్టీఆర్లు కూడా `ఆర్ ఆర్ ఆర్`తో ఈ ట్రెండ్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఈ మూవీకి ఒక్కొక్కరు అందుకున్న పారితోషికం రూ.45 కోట్లు.
రాజమౌళి చేస్తున్న`వారణాసి`కి కూడా మహేష్ ఇదే పంథాలో పారితోషికాన్ని తీసుకుంటున్నాడని తెలిసింది. బాహుబలి` నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ విన్నంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ దాకా పాకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి నుంచి భారీ సినిమాలకు డైరెక్టర్లు, స్టార్ హీరోలు ప్రాఫిట్ అండ్ షేర్ పద్దతిలోనే పారితోషికాలు డిమాండ్ చేయడం ఆనవాయితీగా మారింది. ప్రొడ్యూసర్స్ కూడా లాభాల్లో వాటా పద్దతికి అలవాటు పడిపోయి భారీ సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.
కేజీఎఫ్ స్టార్ యష్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, `డ్రాగన్` మూవీకి ఎన్టీఆర్, ప్రస్తుతం చేస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లకు ప్రభాస్, కోలీవుడ్ స్టార్స్ రజనీ, విజయ్, అజిత్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ వచ్చి చేరడం ఆసక్తికరంగా మారింది. చాలా ఏళ్ల విమరాం తరువాత రెహమాన్ మళ్లీ మెయిన్ ట్రాక్లోకి వచ్చేశాడు. తెలుగులో `పెద్ది` మూవీకి మ్యూజిక్ చేస్తున్న రెహమాన్ ఇదే సమయంలో బాలీవుడ్లో అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణ`కు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్జిమ్మర్తో కలిసి సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ విషయంలో భారీగానే డిమాండ్ చేసిన రెహమాన్ సినిమా పారితోషికం కింద లాభాల్లో వాటాని డిమాండ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత వరకు డైరెక్టర్లు, స్టార్ల వరకు పరిమితమైన ప్రాఫిట్ షేరింగ్ సిస్టమ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లకు పాకడంతో ఇండియన్ సినిమాల్లో నయా ట్రెండ్ మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడో ప్రమాదం ఉంది. ఇదే పద్దతి కింది స్థాయికి కూడా పాకితే నిర్మాతలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని, నిర్మాతల పాలిట ఇది భస్మాసుర హస్తంగా మారే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
