20 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేశాను -ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీగా తనకంటూ ఒకప్పుడు స్టార్ స్టేటస్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
By: Madhu Reddy | 10 Dec 2025 2:00 PM ISTబాలీవుడ్ బ్యూటీగా తనకంటూ ఒకప్పుడు స్టార్ స్టేటస్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది.. ముఖ్యంగా ఒక్కో వెబ్ సిరీస్ కి 45 కోట్ల మేరా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచిన ఈమె.. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మందాకిని అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రాజమౌళి రిలీజ్ చేశారు.
ఇకపోతే ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా విడుదల అవ్వడమే కాకుండా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు 2027 సమ్మర్ స్పెషల్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇన్నేళ్లుగా ఇండియాకి దూరంగా ఉన్న ప్రియాంక చోప్రా ఇప్పుడు ఈ సినిమా ద్వారా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు పలు ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను 20 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.." ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో నాకు తెలియలేదు. అయితే వచ్చిన ప్రతి ప్రాజెక్టును ఒప్పుకున్నాను. ముఖ్యంగా నాకు అవకాశాలు రావడమే అదృష్టంగా భావించాను. అందుకే పాత్ర ఏదైనా సరే ఓకే చెప్పేసాను. ఇక 20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా ప్రాజెక్టులు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే ప్రతి పాత్రను అంగీకరించాను. సినీ జీవితంలో ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో పుట్టిన రోజులు, పండుగ దినాలు మిస్ అయ్యాయి. ఆఖరికి నా తండ్రి హాస్పిటల్ లో ఉంటే ఆయన చివరి రోజుల్లో కూడా నేను దగ్గరుండి మరీ ఆయనను చూసుకోలేకపోయాను. నా కుటుంబంతో గడిపిన సందర్భాలు కూడా లేవు. ఆ సమయంలో అన్ని కష్టాలు పడ్డాను కాబట్టే నేడు ఈ స్థాయిలో ఉన్నాను. 20 ఏళ్లు త్యాగం చేసి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. ముఖ్యంగా నాడు పడ్డ కష్టమే నేడు ఈ స్థాయికి చేర్చింది" అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది
ప్రస్తుతం నచ్చిన స్క్రిప్ట్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది ప్రియాంక చోప్రా. సినిమాల విషయానికొస్తే వారణాసి సినిమాలో నటిస్తున్న ఈమె ఈ సినిమా కోసమే తెలుగు కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇందులో తన పాత్రకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే తెలుగు కూడా నేర్చుకుంటున్నానని చెప్పడంతో తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
