పెద్ద వాళ్ళు వచ్చినా వంగా టీమ్ ఒప్పుకునేలా లేదు
సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్ట్ ను చాలా మంది నిర్మాతలకు చెప్పినా అవకాశం దక్కలేదు.
By: M Prashanth | 1 Sept 2026 10:00 PM ISTసందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్ట్ ను చాలా మంది నిర్మాతలకు చెప్పినా అవకాశం దక్కలేదు. చివరకు అన్న ప్రణయ్ రెడ్డి వంగా, కుటుంబం సపోర్ట్తో భద్రకాళి పిక్చర్స్ పెట్టి ఆ సినిమాను తీశారు. అక్కడి నుంచి సందీప్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. కబీర్ సింగ్, యానిమల్ లో కూడా ఈ సంస్థ భాగమైంది. ఇప్పుడు ప్రభాస్తో ‘స్పిరిట్’ చేస్తున్నారు. అయితే ఈ బ్రాండ్ ఉపయోగించుకుని భద్రకాళి బ్యానర్పై వేరే దర్శకులతో బయట స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రణయ్ ప్లాన్ చేయొచ్చు. కానీ వాళ్ల ఆలోచన ప్రస్తుతం అలా లేదట.
‘రోమాంచకం’ సినిమాను లేటెస్ట్ గా నిర్మించిన విషయం తెలిసిందే. సందీప్ కాకుండా మరో దర్శకుడితో ప్రణయ్ చేస్తున్న మొదటి సినిమా ఇదే. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ కథ సందీప్కు కూడా మొదటి నుంచి తెలుసట. కథ నచ్చడంతో తీసుకున్నారు తప్ప, వంగా పేరు ఉందని దాన్ని పెద్ద బడ్జెట్ సినిమాగా మార్చాలని చూడలేదు. దగ్గరకు వచ్చిన చిన్న కథ నచ్చితే దాన్ని చేయాలనే పద్ధతిలోనే ఈ సినిమా మొదలైందట.
పెద్ద సినిమాల గురించి అడిగినప్పుడు ప్రణయ్ కూడా డైరెక్ట్గానే చెప్పారు. సందీప్ లేకుండా తాను బిగ్ బడ్జెట్ మూవీ చేయలేనని, అది తనకు చాలా పెద్ద రిస్క్ అవుతుందని అన్నారు. అంటే వేరే దర్శకుడు, పెద్ద హీరో కాంబినేషన్ దొరికిందని వెంటనే భారీ బడ్జెట్ పెట్టే ఆలోచన లేదు. అలాంటి సినిమా చేయాలంటే సందీప్ కూడా దాంట్లో ఉండాలనేది ఆయన మాటల్లో కనిపిస్తోంది.
మరోవైపు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన తమకు ఉందని ప్రణయ్ చెప్పారు. సినిమా ఇండస్ట్రీ నుంచి తమకు పేరు, గుర్తింపు వచ్చాయని, ఇప్పుడు తమ వల్ల అయ్యే స్థాయిలో తిరిగి ఏదైనా చేయాలని అనుకుంటున్నారట. కొత్త దర్శకుడు మంచి కథతో వస్తే చూడొచ్చు. కొత్త నటులతో చిన్న సినిమా చేయొచ్చు. కానీ వరుసగా సినిమాలు పెట్టి పెద్ద ప్రొడక్షన్ హౌస్లా నడపాలనే ప్లాన్ మాత్రం తమకు లేదన్నారు.
‘రోమాంచకం’ షూటింగ్లో ప్రణయ్ కూడా ఎక్కువ రోజులు సెట్లోనే ఉన్నారట. కామెడీ సీన్లు, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలు తీసేటప్పుడు దగ్గరుండి చూశానని చెప్పారు. అంటే ఈ సినిమాను కేవలం పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్గా వదిలేయలేదు. కొత్త టీమ్ చేస్తున్న పని ఎలా వస్తుందో చూసుకుంటూ షూటింగ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా తర్వాత భద్రకాళి బ్యానర్ నుంచి వచ్చే ప్రాజెక్టుల ప్లాన్ కూడా కొంచెం అర్థమవొచ్చు. పెద్ద హీరోతో వేరే దర్శకుడి సినిమా కంటే, కొత్త దర్శకుడు తీసుకొచ్చిన చిన్న కథకే ప్రణయ్ ముందుగా ఓకే చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
